హామీలు ఎప్పుడు నెరవేరుస్తావ్?
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:31 PM
రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తావని సీఎం రేవంత్రెడ్డిని డీకే అరుణ ప్రశ్నించారు.
![హామీలు ఎప్పుడు నెరవేరుస్తావ్?](https://media.andhrajyothy.com/media/2024/20240326/53npt05c_b0be3e9418.gif)
- నారాయణపేట రైతు దీక్షలో సీఎంను ప్రశ్నించిన డీకే అరుణ
- దమ్ముంటే సమాధానం చెప్పాలి
- పాలన చేతగాకే హామీల గురించి తప్పించుకునే ప్రయత్నం
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 5 : రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తావని సీఎం రేవంత్రెడ్డిని డీకే అరుణ ప్రశ్నించారు. రైతులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్కు ఈ సారి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ కమిటీ పిలుపు మేరకు నారాయణపేట మునిసిపల్ పార్కు వద్ద శుక్రవారం చేపట్టిన రైతుల దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ, రైతుబంధు, రైతు కూలీలకు రూ.12,000 ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఎప్పడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ద్రోహాం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. మోసం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రైతాంగానికి బోనస్, పంట నష్టపోతే రూ.25,000 పరిహారం ఇస్తామన్నవ్ ఏమైందని ప్రశ్నించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిసిన తరువాత ఏ ధైర్యంతో హామీలు ఇచ్చారు..? మీరు చేసింది మోసం కాదా? అని ప్రశ్నించారు. చితశుద్ధి ఉంటే కర్ణాటకలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా ప్రాజెక్టులోకి నీళ్లు తెప్పించి రైతులు వేసిన పంటలకు నీళ్లు ఇవ్వాలన్నారు. రైతుల గురించి ఆలోచించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందిస్తున్నామని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు, నాయకులు సత్యయాదవ్, గోవర్దన్ గౌడ్, రామచంద్రయ్య, ఎస్.విజయ్కుమార్, నర్సింహ్మ రెడ్డి, లక్ష్మిశ్యామ్ సుందర్, సిద్ది వెంకట్రాములు, రఘురామయ్య, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.