వనపర్తి పురపీఠం కాంగ్రెస్ వశం
ABN , Publish Date - Apr 06 , 2024 | 10:41 PM
వనపర్తి మునిసిపాలిటీలో మూడు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీకే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కాయి. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో పద్మావతి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది.
![వనపర్తి పురపీఠం కాంగ్రెస్ వశం](https://media.andhrajyothy.com/media/2024/20240326/8wnp6_44ab03cad5.jpg)
చైర్మన్గా పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్గా పాకనాటి కృష్ణ ఏకగ్రీవం
11 మంది కౌన్సిలర్ల గైర్హాజరు
వనపర్తి టౌన్, ఏప్రిల్ 6: వనపర్తి మునిసిపాలిటీలో మూడు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీకే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కాయి. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో పద్మావతి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 15 మంది, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆరు మంది, ఒకరు టీడీపీ, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడితో కలిపి 23 మంది సభ్యులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తొమ్మిది మంది, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఓటింగ్ సమావేశానికి సగానికిపైగా సభ్యులు హాజరుకావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రవేశపెట్టారు. దీంతో ఇటీవల కాంగ్రె్సలో చేరిన 13వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక మహే్షను చైర్మన్గా కౌన్సిలర్లు బాపనిపల్లి వెంకటేష్, చీర్ల సత్యం సాగర్ బలపరిచారు. 20వ వార్డు కౌన్సిలర్ పాకనాటి కృష్ణను వైస్ చైర్మన్గా టీడీపీ కౌన్సిలర్ లక్ష్మి బలపరిచారు. ఇద్దరికి కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లతో రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్, వైస్ చైర్మన్ను ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు శాలువ, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి, సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు పోయి, నేడు ఆత్మగౌరవం గెలిచిందన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి నిజమైన అభివృద్ధిని కొత్తగా ఎన్నికైన పాలకులతో చేసి చూపిస్తామన్నారు.
ఫలించని బీఆర్ఎస్ వ్యూహాలు..
మూడు నెలల క్రితం చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన పుట్టపాక మహే్షను ఎలాగైనా చైర్మన్ కాకుండా చేయాలన్న బీఆర్ఎస్ వ్యూహాలు ఫలించలేదు. ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు వేసినప్పటికీ ఎమ్మెల్యే మేఘారెడ్డి మెజారిటీ సభ్యులను ఏకం చేయడంలో సఫలం అయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఎత్తులు పారక.. పోటి లేకుండానే కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది.