Share News

వంశీచంద్‌ పాదయాత్ర

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:05 PM

పాలమూరు పునరుజ్జీవం పేరుతో సీడబ్య్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో పాలమూరు న్యాయ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

వంశీచంద్‌ పాదయాత్ర
వంశీచంద్‌రెడ్డి

రేపు మక్తల్‌ క్షీరలింగేశ్వరస్వామిమఠం నుంచి ప్రారంభం

ముగింపు సభకు సీఎం రేవంత్‌రెడ్డి రాక

మహబూబ్‌నగర్‌, జనవరి 29: పాలమూరు పునరుజ్జీవం పేరుతో సీడబ్య్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో పాలమూరు న్యాయ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 31లో నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గం కృష్ణా గ్రామంలోని క్షీరలింగేశ్వరస్వామి మఠం నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి వంశీచంద్‌ పాదయాత్రపై చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినందున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర స్పూర్తితో ఈ యాత్ర చేపడుతున్నానని ఆయన ప్రకటించారు. 31న జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనరసింహ సమక్షంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో మూడు రోజుల చొప్పున 25 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఫిబ్రవరి నాలుగు నుంచి ఆరు వరకు నారాయణపేట జిల్లాలో, ఎనిమిది నుంచి పదో తేదీ వరకు దేవరకద్ర నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. 11 నుంచి 13 వరకు షాద్‌నగర్‌లో, 15 నుంచి 17 వరకు జడ్చర్ల నియోజకవర్గంలో, 19 నుంచి 21 వరకు మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో యాత్ర సాగనుంది. చివరగా కొడంగల్‌ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌తో చర్చించి పాదయాత్ర తేదీలను నిర్ణయించనున్నారు. ముగింపు సభకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారని పార్టీ శ్రేణులు తెలిపారు. ఏడు నియోజకవర్గాల్లో సాగే పాదయాత్రలో ప్రతీ రోజు ఉదయం 10 కిలో మీటర్లు, సాయంత్రం 10 కిలో మీటర్లు యాత్ర సాగనుంది. రోజూ యాత్ర ముగిసే గ్రామంలో ఆ గ్రామంలోని సామాన్య కార్యకర్త ఇంట్లోనే ఆయన బస చేయనున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:05 PM