బైకు, కారు ఢీకొని ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - Jan 30 , 2024 | 10:59 PM
: బైకు, కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ సమీపంలోని 167 జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది.
![బైకు, కారు ఢీకొని ఇద్దరి దుర్మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మక్తల్, జనవరి 30 : బైకు, కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ సమీపంలోని 167 జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మక్తల్ పట్టణానికి చెందిన ప్రభాకర్ (37), బాల్రాజ్ అలియాస్ భాను(35)లు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడికి సహాయకులుగా పనిచేస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రభాకర్ కాచ్వార్కు ఇల్లరికం వచ్చాడు. అప్పటి నుంచి ప్రభాకర్ కాచ్వార్లో నివాసం ఉంటూ మక్తల్కు వెళ్లేవాడు. కాగా వీరిద్దరూ స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవారు. ఈ క్రమంలో తమ సొంత పనిపై జక్లేర్ వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా కాచ్వార్ సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నది. ఈ సంఘటనలో వీరిద్దరికీ తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడ్డారు. స్థానికులు వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రభాకర్కు భార్య రాధతో పాటు ఏడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. బాల్రాజ్ అలియాస్ భానుకు భార్య మమతతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాచ్వార్కు ఇల్లరికం వచ్చిన ప్రభాకర్ కాచ్వార్ సమీపంలోనే మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనపై ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.