ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:08 PM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- పేట, మక్తల్, ఊట్కూర్ మండలాల్లో సర్వే పరిశీలన
- కోస్గి, మద్దూర్ మండలాల్లో ట్రైనీ కలెక్టర్ తనిఖీ
నారాయణపేట రూరల్/మక్తల్ రూరల్/ఊట్కూర్/కోస్గి/మద్దూర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శనివారం పేట మండలంలోని లింగంపల్లి, కొల్లంపల్లి గ్రామాలతో పాటు, మక్తల్ మండలం లింగంపల్లి, సోమేశ్వరబండ, ఊట్కూర్ మండలం మల్లేపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించి మాట్లాడారు. మిగతా జిల్లాలతో పోలిస్తే పేట జిల్లాలో సర్వే మందకొడిగా సాగుతుందన్నారు. ఈ నెలాఖరులోపు సర్వేను పూర్తి చేయాలని అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో పేట, మక్తల్, ఊట్కూర్ ఎంపీడీవోలు సుదర్శన్, రమేష్, ధనుంజయ్గౌడ్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అదేవిధంగా, మక్తల్ మండలం ఖానాపూర్, కర్ని, టేకులపల్లి, గుడిగండ్ల గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శనివారం డీపీవో కృష్ణ పరిశీలించారు. ఎంపీడీవో రమేష్, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కోస్గి మునిసిపాలిటీలోని ఎనిమిది, తొమ్మిదో వార్డులతో పాటు, మద్దూర్ మండలం పల్లెర్ల గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ట్రైనీ కలెక్టర్ గరీమానరుల శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే పారదర్శకంగా కొనసాగాలని ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి లబ్ది చేకూర్చాలని అధికారులకు సూచించారు. కోస్గిలో మునిసిపల్ చైర్మన్ నాగరాజు, మద్దూర్లో ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఎంపీవో రామన్న, గ్రామాల అధికారులు, సర్వే సిబ్బంది ఉన్నారు.