కేజీబీవీలో విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:13 PM
తమకు పాఠాలు బోధించేందుకు టీచర్లు కావాలని కోరుతూ కేజీబీవీ విద్యార్థులు శనివారం నిరసన చేపట్టారు.

కోయిలకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : తమకు పాఠాలు బోధించేందుకు టీచర్లు కావాలని కోరుతూ కేజీబీవీ విద్యార్థులు శనివారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో టీచర్లు లేక అవస్థలు పడుతున్నామని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన తెలిపారు. విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎంఈవో ముగ్గురు మహిళా టీచర్లను కేజీబీవీకి పంపగా, వారు వద్దని విద్యార్థులు పట్టుబట్టారు. దాదాపు గంట సేపు గేటు వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాత్రికి మహిళా పోలీసులను కేజీబీవీలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎంఈవో వెంకట్జీ తెలిపారు.
మిడ్జిల్ : మండల కేంద్రంలోని కేజీవీబీలో విద్యార్థులు గేటుకు తాళం వేసి శనివారం నిరసన వ్యక్తం చేశారు. కేజీవీబీకి కొత్త ఉపాధ్యాయులు వస్తున్నారని తమకు పాఠాలు ఆర్థం కావడం లేదని, కొత్త ఉపాధ్యాయులు లోపలికి రాకుండా తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో సుధాకర్, ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు విద్యార్థులకు నచ్చజెప్పి పాఠాలు అర్థమయ్యేలే ఉపాధ్యాయులు బోధిస్తారని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న అధికారులతో తహసీల్దార్ రాజు ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అదేశించారు. మధ్యాహ్నం ఎంపీడీవో గీతాంజలి కేజీవీబీని పరిశీలించారు.
నవాబ్పేట : పరీఓల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం లేదంటూ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో తమసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో జయరాములు, ఎస్ఐ విక్రం ఉపాధ్యాయులు వచ్చేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.