మాల్ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:11 PM
ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు.
![మాల్ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు](https://media.andhrajyothy.com/media/2024/20240301/33_Gdl1_9e2b8cb8f7.jpg)
- పకడ్బందీగా ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ
- అధికారులతో కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మార్చి 1 : ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయని, మార్చి 19 వరకు కొనసాగుతాయని తెలిపారు. మార్చి 19 నుండి ఏప్రిల్ రెండు వరకు 10వ తరగతి పరీక్షలు కొనసాగుతా యన్నారు. అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇంటర్, 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ సెల్ఫోన్ తీసుకెళ్లడానికి వీలు లేదన్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులు సకాలం లో చేరుకునేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి హృదయరాజు, డివిజన్ పంచాయితీ అఽధికారి వెంకట్రెడ్డి, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.