Share News

గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రావాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:28 PM

గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రావాలని క్రికెట్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ అన్నారు.

గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రావాలి
క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతున్న రాజశేఖర్‌

- జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 25 : గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి రావాలని క్రికెట్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ అన్నారు. జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఎండీసీఏ మైదానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా అండర్‌-23 క్రికెట్‌ టోర్నీ ఉత్సాహంగా కొనసాగుతోంది. శుక్రవారం మూడవ రోజు నాగర్‌కర్నూల్‌, వనపర్తి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం సహకారంతో గత వేసవిలో శిక్షణా శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడా కారులకు అండగా ఉంటామని తెలిపారు. ఉమ్మడి జిల్లా టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి తుది జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా జట్టు హెచ్‌సీఏ టోర్నీలోనూ పాల్గొం టుందని చెప్పారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రతినిధులు సురేష్‌ కుమార్‌, వెంకటరామరావు, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా పాల్గొన్నారు.

16 పరుగులతో నాగర్‌కర్నూల్‌ జట్టు గెలుపు

ఉమ్మడి జిల్లా అండర్‌-23 క్రికెట్‌ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నాగర్‌కర్నూల్‌ జట్టు 16 పరుగుల తేడాతో వనపర్తిపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నాగర్‌కర్నూల్‌ జట్టు 44.2 ఓవర్లలో 169 పరుగులకు అలౌట్‌ అయ్యింది. జట్టులో తరుణ్‌ 35 పరుగులు చేయగా, వనపర్తి జట్టు బౌలర్లలో చత్రపతి నాలుగు, దానిష్‌, ప్రణీత్‌రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు 31 ఓవర్లలో 153 పరుగులకు కూప్పకూలింది. వనపర్తి జట్టులో అభిలాష్‌ (56) అర్ధ సెంచరీతో రాణించాడు. నాగర్‌కర్నూల్‌ జట్టు బౌలర్లలో అభినవ్‌తేజ నాలుగు, జయంత్‌ రెండు వికెట్లు తీసి జట్టు గెలుపునకు కృషి చేశారు.

Updated Date - Oct 25 , 2024 | 11:28 PM