Share News

బీజేపీకి త్వరలో రాజీనామా

ABN , Publish Date - Mar 27 , 2024 | 10:59 PM

బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి జే. చిత్తరంజన్‌దాస్‌ తెలిపారు. త్వరలోనే సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లురవి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

బీజేపీకి త్వరలో రాజీనామా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిత్తరంజన్‌ దాస్‌

కాంగ్రెస్‌లో చేరతా: మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌

కల్వకుర్తి, మార్చి 27 : బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి జే. చిత్తరంజన్‌దాస్‌ తెలిపారు. త్వరలోనే సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లురవి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీలోకి తనను ఆహ్వానించి జడ్చర్ల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి మన ప్రాంతవాసి కావడం, ఎంపీ అభ్యర్థిగా మల్లురవిని ప్రకటించడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవిలతో కలిసి తాను పని చేశానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం తాను పని చేస్తానన్నారు. కల్వకుర్తి ప్రాంత అభివృద్ధే తన ఏకైక లక్ష్యమన్నారు. అనంతరం మాజీ మంత్రిని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మిరియాల శ్రీనివాస్‌రెడ్డి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు గోపిరెడ్డి చిన్నరాంరెడ్డి, రమాకాంత్‌రెడ్డి, సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 10:59 PM