రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:13 PM
వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
- ఐజీ సత్యనారాయణ
మహబూబ్నగర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డ్లను పరిశీలించి అనుసరించాల్సిన విధానాలపై సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జోన్ పరిధిలో 2024లో మొత్తం 16,833 కేసులు నమోదయ్యాయని, వీటిలో 3,784 కేసులు పరిశీలనలో ఉన్నాయన్నారు. పోలీస్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని రికార్డుల నిర్వహణలో సరైన విధానాలు పాటించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇది బాధ్యతాయుతమైన పరిపాలనకు దోహదం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి పాల్గొన్నారు.
ప్రజావాణికి 11 దరఖాస్తులు
పోలీస్శాఖ నిర్వహిస్తున్న ప్రజావాణికి సోమవారం 11 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితుల నుంచి ఎస్పీ జానకి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి సమస్యలు విన్న ఆమె అప్పటికప్పుడే సంబంధిత స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా పోలీస్స్టేషన్లకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలని ఎలాంటి పైరవీలు అక్కర్లేదన్నారు.