తప్పనిసరిగా రశీదు ఇవ్వాలి
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:53 PM
ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ ఎం.సక్రియానాయక్ హెచ్చరించారు.
- ఏడీఏ ఎం.సక్రియా నాయక్
ఇటిక్యాల, ఏప్రిల్ 19 : ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ ఎం.సక్రియానాయక్ హెచ్చరించారు. ఇటిక్యాల మండలంలోని ఉదండాపురం, జింకలపల్లి, ఎర్రవల్లిలోని ఎరువుల దుకాణాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువులను ప్రభుత్వ నిర్ణయిం చిన ధర (ఎంఆర్పీ)కే విక్రయించాలని సూచించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని యజమానులను ఆదేశించారు. కంపెనీల నుంచి కేటాయించిన రసాయనిక ఎరువుల ఇన్వాయిస్లను ఈ పాస్లో పొందుపరచిన తర్వాతే రైతులకు విక్రయించాలని చెప్పారు. వర్షాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తారని తెలిపారు. వారు నాసిరకం ఎరువులు కొనుగోలు చేసి నష్టపోకుండా ముందుజాగ్రత్త చర్యగా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్షాకాలంలో సాగుకు అవసరమైన ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.