అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:00 PM
ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు.
![అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి](https://media.andhrajyothy.com/media/2024/20240301/100_WNP_1_dd4e6ef7c2.jpg)
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
వనపర్తి రాజీవ్చౌరస్తా, మార్చి 1: ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ... ఇంటర్తో పాటు త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. సరైన రూట్ నిర్దేశించుకుని విద్యార్థులకు బస్సు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోను పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించేది లేదన్నారు. ఎవరైనా తీసుకెళ్లినట్లు తెలిస్తే కేసు నమోదు చేయాలన్నారు. కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ రక్షిత కె.మూర్తి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మద్దిలేటి, విద్యాశాఖ అధికారులు గణేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద చీఫ్ సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఆయన వెబెక్స్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ... ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో చీఫ్ సూపరింటెండెంట్లదే కీలకబాధ్యత అని తెలిపారు. పరీక్షల ప్రశ్నాపత్రాల్ని, సమాధాన పత్రాల్ని చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలోనే తరలించాలన్నారు. అది కూడా క్లోజ్డ్ వాహనాల్లోనే తరలించాలని సూచించారు. ఇందుకోసం తహసీల్దార్లతో చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయం చేసుకోవాలని కోరారు. తహసీల్దార్లు తమ పరిధిలోని పరీక్ష కేంద్రాలను విజిట్ చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రానికి కనీసం వంద మీటర్ల దూరంలో పార్కింగ్ ఉండేలా చూడాలని సూచించారు. చీఫ్ సూపరిం టెండెంట్తో సహ ఏ ఒక్కరు పరీక్ష కేంద్రం లోపలికి సెల్ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని సూచిం చారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారు లు, చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు తదితరు లు పాల్గొన్నారు.