Share News

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:58 PM

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అమ్మాలని నాగర్‌కర్నూల్‌ ఏడీఏ రమేష్‌బాబు అన్నారు.

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
పెద్దకొత్తపల్లిలోని అరుణోదయ ఫర్టిలైజర్‌ షాపులో విత్తనాలను పరిశీలిస్తున్న నాగర్‌కర్నూల్‌ ఏడీఏ రమేష్‌బాబు

- నాగర్‌కర్నూల్‌ ఏడీఏ రమేష్‌బాబు

- మండల కేంద్రాల్లో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు

పెద్దకొత్తపల్లి/బిజినేపల్లి/లింగాల /తిమ్మాజిపేట/వంగూరు, జూన్‌ 7 : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అమ్మాలని నాగర్‌కర్నూల్‌ ఏడీఏ రమేష్‌బాబు అన్నారు. శుక్రవారం ఇంటర్నల్‌ స్క్వాడ్‌లో భాగంగా పెద్దకొత్తపల్లిలోని అరుణోదయ ఫర్టిలైజర్‌, శ్రీలక్ష్మీనరసింహా ఫర్టిలైజర్‌, బాలాజీ ట్రేడర్స్‌, మన గ్రోమోర్‌ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ విత్తనాలు, ఎరువుల అమ్మకంపై రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, నాసిరకమైన విత్తనాలు అమ్మితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట తెలకపల్లి, పెద్దకొత్తపల్లి వ్యవసాయ అధికారులు సందీప్‌ రెడ్డి, శ్రీరామ్‌, ఏఈవో ముజీబ్‌ తదితరులున్నారు. అదేవిధంగా, బిజినేపల్లి మండల కేంద్రంలోని గౌతమి సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌, భాగ్యలక్ష్మి ఏజెన్సీస్‌, శ్రీసాయి ట్రేడర్స్‌, ధనలక్ష్మి ట్రేడర్స్‌, సంపత్‌ ట్రేడర్స్‌, ఆగ్రో రైతు సేవా కేంద్రం, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, హోంసాయి ట్రేడర్స్‌, యంగ్‌ ఫార్మర్స్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రైతు సేవా కేంద్రాలను ఇంటర్నల్‌ స్క్వాడ్‌ ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టాక్‌ రికార్డులను, ధరల పట్టికను, సేల్స్‌ రికార్డులను, నిల్వ రికార్డులను పరిశీలించి, దుకాణాల్లో నిల్వ ఉన్న స్టాక్‌ను సరిచూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు విత్తనాలను, ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు విక్రయించినట్లు తెలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, షాపుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. లింగాలలోని ఎరువులు, విత్తనాల దుకాణాల ను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి నాగార్జునరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లోని స్టాక్‌ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. అనంతరం డీలర్లకు పలు సూచనలు చేశారు. ఏవో వెంట ఏఈవో సురేందర్‌రెడ్డి ఉన్నారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలోని విత్త నాలు పురుగుల మందుల దుకాణాన్ని శుక్రవారం ఏవో కమల్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో రికార్డులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. వంగూరు మండల కేంద్రంతో పాటు, పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో శుక్రవారం ఎరువుల దుకాణాలను ఏవో తనూజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆయా దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం డీలర్లకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఆయా గ్రామాల ఏ ఈవోలు ఉన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 10:58 PM