స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్
ABN , Publish Date - Aug 06 , 2024 | 11:00 PM
తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- ఘనంగా ప్రొఫెసర్ జయశంక్ జయంతి
నారాయణపేట టౌన్, ఆగస్టు 6 : తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతిని నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని, జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారని ఎంతగానో శ్రమించిన గొప్ప మమనీయుడు జయశంకర్ అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మయాంక్ మిట్టల్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.
నారాయణపేట : తెలంగాణ సిద్ధాంత కర్త, తొలితరం ఉద్యమకారుడిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 తొలితరం తెలంగాణ ఉద్యమంలో, నాన్ ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ ఉద్యమంలో జయశంకర్ చురుకుగా పాల్గొన్నారన్నారు. తెలంగాణ ప్రజల యాస, భాష, సంస్కృతులు, జీవన విధానంపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి జయశంకర్ అన్నారు. రాష్ట్ర ఆవశ్యకతపై పుస్తకాలు రాసి తెలంగాణాలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారని, తన ఆస్తిని, జీవితాన్ని ధార పోశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, ఆర్ఐ నరసింహ, ఆర్ఎస్ఐ శివశంకర్, రిజర్వు పోలీస్, సిబ్బంది పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్సాగర్, వేపూరి రాములు, చెన్నారెడ్డి, గురులింగం, సుదర్శన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, మల్రెడ్డి, రాంరెడ్డి, దేవరాజ్ పాల్గొన్నారు.
మక్తల్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్వగృహంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం తెరాస పార్టీని స్థాపించి, రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధ్యమని నిరూపించారన్నారు. బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గుప్తా, ఎల్లారెడ్డి, చిన్న హన్మంతు, వన్నెకారి సంతోష్, సాగర్, నర్సింహారెడ్డి, రాజు, అశోక్గౌడ్ పాల్గొన్నారు.