అధ్యక్షా!
ABN , Publish Date - Feb 07 , 2024 | 11:02 PM
అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అటు ఎమ్మెల్యేలతో పాటు, ఇటు ప్రజలు అభివృద్ధి పనుల మంజూరు, పెండింగ్ పనుల పూర్తిపై ఆశలు పెట్టుకున్నారు.
![అధ్యక్షా!](https://media.andhrajyothy.com/media/2023/20231205/02hyngg_Telangana_Assembly_042411bde7.jpg)
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
అభివృద్ధి పనులకు నిధులు కోరతాం
పెండింగ్ బిల్లులు, గ్రామాల్లో సమస్యలపై విన్నవిస్తాం
‘ఆంధ్రజ్యోతి’తో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అటు ఎమ్మెల్యేలతో పాటు, ఇటు ప్రజలు అభివృద్ధి పనుల మంజూరు, పెండింగ్ పనుల పూర్తిపై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీకి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో సగానిపైగా కొత్తవారే ఉన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఏం మాట్లాడతారని ‘ఆంధ్రజ్యోతి’ శాసన సభ్యులను అడిగింది. వారు లేవనెత్తే అంశాలు వారి మాటల్లోనే..
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్నగర్
ఉమ్మడి జిల్లా ప్రగతి కోసం కృషి చేస్తా
అసెంబ్లీ బడ్జెట్ సమావే శా ల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రగతి కోసం కృషి చేస్తా. జిల్లా సమస్యలను ప్రభుత్వం దృషికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. ప్రధానంగా పాల మూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూ ర్తి కోసం నిధులు మంజూరు, పనులు వేగవంతంగా జరిగేలా ప్రభుత్వాన్ని కోరతా. విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నిధులు మంజూరు చేస్తా.
- మంత్రి జూపల్లి కృష్ణారావు
అభివృద్ధి పనులపై ప్రస్తావిస్తాను
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు గ్యారంటీలను అమలు చేశాం. మరో రెండు గ్యారంటీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయమై ప్రస్తావిస్తాను. ఆర్థిక వ్యవస్థ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వంలో మాదిరిగా అనవసరపు ప్రాజెక్టులను టేకప్ చేసి, డబ్బులు వృథా చేయకూడదని విన్నవిస్తాను.
- యెన్నం శ్రీనివా్సరెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే
100 పడకల ఆస్పత్రి కావాలి
గత ప్రభుత్వంలో పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కరివెన రిజర్వాయర్ను పూర్తి చేయలేదు. కోయిల్సాగర్ ఆయకట్టు పెంచలేదు. ఆ పనులన్నీ పూర్తి చేసేలా బడ్జెట్లో పెట్టేందుకు అడుగుతాం. దేవరకద్రలో 100 పడకల ఆస్పత్రి, కొత్తకోటలో 50 పడకల ఆస్పత్రి, నియోజకవర్గ కేంద్రంలో చాలా రోజులుగా డిమాండ్ ఉన్న డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లాను. వాటిని మంజూరు చేయిస్తాను.
- జి.మధుసూదన్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
పెండింగ్ బిల్లులపై దృష్టి
వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.250 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మెడికల్ కాలేజీకి రూ.64 కోట్లు, రోడ్లకు రూ.26 కోట్ల బిల్లులను ఈ సమావేశాల్లో మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. వనపర్తి, పెబ్బేరు పట్టణాల్లో రోడ్ల విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతా. గ్రామాల్లో డెవల్మెంట్, సర్పంచులకు పెండింగ్ బిల్లులపై ప్రస్తావిస్తాను.
- తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే
పునరావాస సమస్యపై ఫోకస్
మక్తల్ నియోజకవర్గంలో నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా పునరావాస సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గత ప్రభుత్వం వారికి పెండింగ్ పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో పునరావాస సమస్యలు పరిష్కరించాలని, పరిహారం ఇవ్వాలని కోరబోతున్నాం. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లాను. బడ్జెట్లో మంజూరు చేయించుకుంటాను.
- వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే
జీఓ 69 సాధిస్తాం..
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం(జీవో 69) ద్వారా నియోజకవర్గంలోని 1.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం. ఈ అంశాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తా.
- చిట్టెం పర్ణికారెడ్డి, నా.పేట ఎమ్మెల్యే
నిధులు కేటాయించాలి
అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు అడుగుతా. ఆర్డీఎస్ కెనాల్ను డీ40 వరకు కాంక్రిట్తో ఆధునికీకరించాలి. డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. గురుకులాలకు భవనాలు మంజూరు చేయాలి.
- విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే
సాగునీటి అంశాన్ని ప్రస్తావిస్తా
ఎంజీఎల్ఐ పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలనేది నా ఆకాంక్ష. ఈ డిమాండ్ను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. కల్వకుర్తి, ఆమన్గల్లో వంద పడకల ఆస్పత్రులు నిర్మించాల, ఆమన్గల్లో డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరుతా.
- కశిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే
అదనపు రిజర్వాయర్లు నిర్మించాలి
ఎంజీఎల్ఐ పథకంలో మెట్ట భూములకు నీరందడం లేదు. డిస్ట్రిబ్యూటరీ వ్య వస్థ, అదనపు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చే పట్టాలని, గ్రామీణ రోడ్లు బాగు చేయాలని, పాఠశాలలను సరిగా నిర్వహించాలని కోరుతా.
- కూచకుళ్ల రాజేష్రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే
నిధులివ్వాలని అడుగుతా
గత ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. సీఎం ప్రత్యేక నిధుల కింద గద్వాల మునిసిపాలిటీకి రూ.50 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేశారు. ఆ నిధులను ప్రస్తుత ప్రభుత్వం ఆపింది. గతంలో మంజూరైన పనులు, నిధులు ఇవ్వాలని అడుగుతా
- బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే
భూముల ఆక్రమణను తెలుపుతా
బల్మూరు మండలం అనంతవరం వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నాయకులు, ఆంధ్ర ప్రాంతం వారు ఆక్రమించుకున్నారు. వాటిపై విచారణ చేయాలని కోరతా. విద్యా సంస్థలు నెలకొల్పాలని అడుగుతా.
- చిక్కుడు వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే