ఎల్ఆర్ఎస్తో ఊరట
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:11 AM
ప్రభుత్వం ఎట్టకేలకు ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)కు పచ్చజెండా ఊపింది.
![ఎల్ఆర్ఎస్తో ఊరట](https://media.andhrajyothy.com/media/2024/20240227/500mb17_c26845954d.jpg)
- లబ్ధిపొందనున్న 2.5 లక్షల మంది
- పాలమూరు.. వనపర్తిలలోనే అత్యధికం
- ఉమ్మడి జిల్లాలో సమకూరనున్న రూ.300 కోట్ల ఆదాయం
- ఆనందంలో లబ్ధిదారులు
- నాలుగేళ్ల నిరీక్షణకు తెర తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మహబూబ్నగర్, ఫిబ్రవరి 27: ప్రభుత్వం ఎట్టకేలకు ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)కు పచ్చజెండా ఊపింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అనుమతిలేని లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 ఆగష్టులో నాటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం కోసం దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నిబంధనల మేరకే ఫీజు చెల్లించాలని నిర్ణయించడంతో లబ్ధిదారు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఫీజు నిర్ణయించనున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరులోని 19 మునిసిపాలిటీలలో 1,94,493 మంది తమ అసెస్మెంట్లకు సంబంధించిన వాటిని క్రమబద్ధీక రించుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, గ్రామ పంచాయతీలలోని ప్లాట్లకు సంబంధించి మరో 50-60 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్లాట్ సైజుల ప్రకారం ఫీజు కట్టించుకోలేదు. దీనికోసం నాలుగేళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తునే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం మార్చి 31 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో దరఖాస్తు చేసుకునే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు పెద్దఎత్తున ఆదాయం సమకూరనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎల్ఆర్ఎస్ల రూపంలో రూ.300-400 కోట్ల ఆదాయం సమకూరనుంది. కాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ల విషయంలో దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలున్న భూములు తప్పా ఇతర లేఅవుట్లను క్రమబద్దీకరించాలని నిర్ణయించడంతో దరఖాస్తు చేసుకున్నవాటిలో కొన్ని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
పురపాలికల్లో దరఖాస్తులు ఇలా...
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మునిసిపాలిటీలో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మహబూబ్నగర్, వనపర్తి మునిసిపాలిటీలలో దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్నగర్ మునిసిపాలిటీలో 31,144 దరఖాస్తు లు వచ్చాయి. ఇందులో కొన్ని వివాదంలో ఉన్న ప్లాట్ల స్థలాలు కూడా ఉన్నాయి. అధికారులు వీటిపై విచారణ చేసి క్రమబద్ధీరణ చేయాల్సి ఉంది. వనపర్తి మునిసిపాలిటీలో 28,941 దరఖాస్తులు వచ్చాయి. అచ్చంపేటలో 11,971, అలంపూర్లో 425, ఆత్మకూర్లో 3,788, జడ్చర్లలో 17,564, భూత్పూర్లో 5,999, గద్వాలలో 14,317, అయిజలో 9,767, కల్వకుర్తిలో 11,443, కొల్లాపూర్లో 4,565, కోస్గిలో 3,909, కొత్తకోటలో 7,539, మక్తల్లో 10,498, నాగర్ కర్నూల్లో 16,011, నారాయణపేటలో 6,962, పెబ్బేరులో 7,282, మరచింతలో 438, వడ్డెపల్లిలో 1,930 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా లే అవుట్లకు పలు దర ఖాస్తులు వచ్చాయి. నారాయణపేట లో లే అవుట్ల కోసం 45, మక్తల్ లో 29, కోస్గిలో 35, వనపర్తిలో 42, పెబ్బేరు లో 45, ఆత్మకూరులో 24, అమరచింత లో 4, కొత్తకోటలో 41, అయిజలో 10 దరఖాస్తులు వచ్చాయి.
సమకూరనున్న ఆదాయం..
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నీ క్రమబద్ధీకరిస్తే మునిసిపాలిటీలకు ఆదాయం సమకూరనుంది. చాలా మునిసిపాలిటీలలో నిధులు లేక కనీస వసతులు కల్పించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నిధులతో మునిసిపాలిటీల ఖజానా కళకళలాడనుం ది. అయితే ఈ ఫీజులు నేరుగా మునిసిపాలిటీలకు జమ అవుతాయా..? ప్రభుత్వ ఖజనాకు వెళ్తాయా అన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. పురపాలకులు మాత్రం నేరుగా మునిసిపాలిటీల ఖాతాలలో జమచేస్తే మౌలిక వసతులకు ఉపయోగిస్తామని చెబుతున్నారు.