Share News

ఒక్క షరతు

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:17 PM

బీఆర్‌ఎస్‌ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలోకి వెళ్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన పార్టీ మారతారనే చర్చ కూడా జరిగింది.

ఒక్క షరతు

అందుకు ఒప్పుకుంటేనే కాంగ్రె్‌సలోకి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి?

సరితకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి పునరుద్ధరించొద్దని కండీషన్‌

బండ్ల చేరిక ఆలస్యానికి కారణం అదే

గతంలో బీఆర్‌ఎ్‌సలోనూ ప్రస్తుత పదవుల్లో ఉన్న ఆ ఇద్దరు

అప్పుడు తరచూ విభేదాలు.. బహాటంగానే రెండు వర్గాల గొడవలు

మంత్రితో తెగని చర్చలు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలోకి వెళ్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన పార్టీ మారతారనే చర్చ కూడా జరిగింది. అలాగే పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా వాదన తెరపైకి వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆయన చేరికపై ఎలాంటి నిర్ణయం అధికారికంగా జరగలేదు. కింది స్థాయి కార్యకర్తలతోపాటు.. ముఖ్య నాయకులు కూడా హస్తం గూటికి వెళ్లడం ఖాయమేనని కుండబద్దలు కొడుతుండగా.. ఆయన మాత్రం కాంగ్రెస్‌ నుంచి ఒత్తిడి ఉందని, చేరాలని కోరుతున్నారని, కానీ తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బదులిస్తున్నారు. సోమవారం కూడా ఎమ్మెల్యే ఇంటి వద్ద పలు మండలాల బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సమావేశమై చర్చించుకున్నారు. కార్యకర్తల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఉన్నా, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, మంత్రులు పిలుస్తున్నా.. కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరడానికి ఒక్క ఇబ్బంది ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత జడ్పీచైర్‌పర్సన్‌ సరితకు ఆ పదవి మళ్లీ పునరిద్ధరిస్తామని చెప్పడంతో ఆయన దానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు ఆయన పార్టీ మార్పు ఉంటుందా?.. ఉంటే గతంలో విభేదించుకున్న ఈ ఇద్దరు మళ్లీ కలిసి ఒకే తాటిపైకి వచ్చి పని చేయగలుగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికి వారు పైకి ఏం చెప్పకపోయినా.. లోలోపల ప్రయత్నాలను చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరిత కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్టీ కోసం భారీగా ఖర్చు కూడా చేశారు. డీకే అరుణ బీజేపీలో చేరిన తర్వాత చుక్కాని లేని నావలా మారిన పార్టీని.. రెండో స్థానంలో నిలిపారని చెప్పొచ్చు. అలాగే బీసీ వాదం కొంత వృద్ధి చెంది.. ఆమె చుట్టూ నాయకుల పోలరైజేషన్‌, వర్గం తయారైంది. బీఆర్‌ఎ్‌సలో ఉన్న పలువురు ముఖ్య నాయకులు కూడా ఆమె వర్గంలో చేరిపోయారు. అలాగే ఎన్నికల సమయంలో ఆమె వర్గంలో ఉన్న వారు తర్వాత విభేదించి.. మరో వర్గంగా తయారయ్యారు. అయితే ఇప్పుడు ఆమె వర్గాన్ని కాపాడుకోవడానికి తనకూ ఒక పదవి అవసరం ఉంటుంది. అదే సమయంలో ఆమెకు పదవి ఉంటే.. కృష్ణమోహన్‌రెడ్డి పని చేసుకోవడానికి గతంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వీలుపడదు. ఈ నేపథ్యంలోనే ఇంత తాత్సారం నడుస్తున్నట్లు సమాచారం.

గతంలోనూ వర్గపోరు..

గతంలో బీఆర్‌ఎ్‌సలోనే సరిత మానవపాడు నుంచి జడ్పీటీసీగా గెలిచి, ఆ తర్వాత జడ్పీచైర్‌పర్సన్‌ అయ్యారు. అందుకు అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న డాక్టర్‌ వీఎం అబ్రహాం, కృష్ణమోహన్‌రెడ్డి కూడా సహకరించారు. ఆ తర్వాత మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి జడ్పీచైర్‌పర్సన్‌ వర్గానికి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం, ప్రొటోకాల్‌ ప్రకారంగా జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఎమ్మెల్యేల కంటే పెద్దది కావడం.. గతంలో గద్వాల నుంచి పోటీ చేస్తామనే ప్రకటనలతో ఇద్దరు ఎమ్మెల్యేలతో ఆమెకు విబేధాలు తలెత్తాయి. ప్రొటోకాల్‌ విషయంలో తరచూ గొడవలు కూడా జరిగాయి. కానీ గత బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌ తరఫునే టిక్కెట్‌ వస్తుందని సరిత ఆశించగా కృష్ణమోహన్‌రెడ్డికే టికెట్‌ ఇస్తారని తెలియడంతో ఆమె కాంగ్రె్‌సలో చేరారు. సీరియ్‌సగా గ్రౌండ్‌ వర్క్‌ చేసుకోవడంతో తక్కువ తేడాతో ఓటమి చెందారు. ఒక దశలో సరిత గెలుస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలోకి వెళ్తే.. సరిత వర్గానికి పెద్ద ఎదురుదెబ్బగానే పరిగణించవచ్చు. ఎన్నికల సమయంలో వెంట ఉన్న బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు ఇప్పటికే సరితతో విభేదించి.. తరచూ గొడవల మధ్య పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కృష్ణమోహన్‌రెడ్డి వస్తే ఇంకా ఇబ్బంది పెరిగే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అయితే జడ్పీచైర్‌పర్సన్‌ పదవి మళ్లీ పునరుద్ధరిస్తే సరిత వర్గానికి నష్టం ఉండదు. కానీ పార్టీలో మాత్రం రెండు వర్గాలు సాధారణం కానున్నాయి. జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి సరితకు మళ్లీ ఇస్తే.. కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉండదు. గతంలో ఆమె పార్టీ మారిన తర్వాత కృష్ణమోహన్‌రెడ్డి వర్గం స్వేచ్ఛగా భావించింది. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన సరిత తనకు ఆ పదవిని పునరుద్ధరించాలని కోరినట్లు తెలుస్తుండగా.. కృష్ణమోహన్‌రెడ్డి చేరికపై ఎలాంటి నిర్ణయం జరగలేదని ఆయన బదులిచినట్లు సమాచారం. అయితే చేరిక అంశంపై ఇప్పటివరకు మంత్రి స్థాయిలోనే చర్చలు జరుగుతున్నట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది.

వారు కూడానా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకుగాను 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. గద్వాల జిల్లాలోని రెండు స్థానాలను బీఆర్‌ఎస్‌ తిరిగి కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా వెంకట్రామిరెడ్డి, ఆయన టికెట్‌ ఇప్పించుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యే విజయుడిని పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు సీఎంకు బంధువైన ఓ వ్యక్తి సంప్రదించినట్లు సమాచారం. ఎన్నికల సమయం కావడంతో ఇప్పుడు మాట్లాడటం సరికాదని చల్లా చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవకపోవడంతో చాలామంది సీనియర్లు పార్టీని వీడేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సొంత జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వారే ఉండాలని సీఎం కూడా భావిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కృష్ణమోహన్‌రెడ్డితో చర్చలు కొలిక్కి వస్తే.. ఆ తర్వాత చల్లా, విజయుడిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయనున్నారు. అయితే అక్కడ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఈ చేరికకు అడ్డుపడే అవకాశం ఉంది. అలాగే కృష్ణమోహన్‌రెడ్డి చేరిక విషయంలో కూడా జడ్పీ చైర్‌పర్సన్‌ సరితకు సంపత్‌ మద్దతు ఇస్తున్నా రని తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో డాక్టర్‌ మల్లు రవికి వీరు సహకరించడంతో ఆయన్ను కూడా ఈ చేరికల విషయంలో సరిత, ఆమె వర్గం నాయకులు కలిసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఒక్క షరతు విషయంలో క్లారిటీ వస్తే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రె స్‌లోకి వస్తారా? రారా? అనే విషయం తేలనుంది.

Updated Date - Jun 17 , 2024 | 11:17 PM