Share News

బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:13 PM

దేశంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని, నరేంద్రమోదీ ముచ్చటగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నా రు.

బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

- రాష్ట్రంలో 12 స్థానాల్లో పార్టీ గెలుపు : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

గద్వాల, ఏప్రిల్‌ 18 : దేశంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని, నరేంద్రమోదీ ముచ్చటగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నా రు. గద్వాల పట్టణంలోని ఎస్‌వీ ఈవెంట్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన గద్వాల, అలంపూర్‌, వనపర్తిలకు చెందిన బూత్‌ అధ్యక్షులు, కన్వీనర్లు, ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ హవా వీస్తుందని, రాష్ట్రంలోని 12 పార్లమెంటు స్థానాలలో పార్టీ గెలువబోతోందని ప్రకటించారు. కొంత కష్టపడితే హైదరాబాద్‌ కూడా మనదేనని అన్నారు. నామినేషన్‌ వేసిన తర్వాత అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ మొదటిసారి గద్వాలకు వచ్చినట్లు తెలి పారు. బీజేపీ కార్యకర్తలు ఎన్నో ఉద్యమాలు చేశారని, ఆటుపోట్లను ఎదుర్కొన్నారని అన్నారు. ఆలాంటి కార్యకర్తలకు ఓటర్లను కలవడం పెద్ద విషయం కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేళ్ల పాలనను ప్రజలకు, ఓటర్లకు వివరించి, ప్రతీ ఓటు బీజేపీకి పడేలా కృషి చేయాలని కోరారు. నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో భరత్‌ ప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌పాషా, అయ్యపురెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జక్కా రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:13 PM