Share News

జోగులమ్మ తల్లీ.. దీవించవమ్మా

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:55 PM

జములమ్మ బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తీసుకొచ్చేందుకు ఎద్దుల బండి పుట్టినిల్లు గుర్రంగడ్డకు వెళ్లింది.

జోగులమ్మ తల్లీ.. దీవించవమ్మా
అమ్మవారిని తీసుకొచ్చేందుకు సారెతో వెళ్తున్న వారిని సాగనంపుతున్న చైర్‌పర్సన్‌ దంపతులు

- ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

- భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం

- నేడు మెట్టినింటికి రానున్న అమ్మవారు

గద్వాల, ఫిబ్రవరి 20: జములమ్మ బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తీసుకొచ్చేందుకు ఎద్దుల బండి పుట్టినిల్లు గుర్రంగడ్డకు వెళ్లింది. అంతకుముందు ఆలయానికి వచ్చిన జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సరిత దంపతులకు అర్చకులు, ఆలయ చైర్‌పర్సన్‌ కుర్వ గాయత్రి, ఈవో పురేందర్‌కుమార్‌ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారిని మెట్టినింటికి తీసుకరావడానికి నిర్వాహకులు సారెతో బయల్దేరారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు వారిని బాజా భజంత్రీలతో ఎద్దుల బండి వరకు సాగనంపారు. జమ్మిచేడు, లత్తీపురం, బీరోలు మీదుగా సాయంత్రం వారు గుర్రంగడ్డకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం బుధవారం తెల్లవారుజామున అమ్మవారిని జమ్మిచేడుకు తెస్తారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్‌ కుర్వ సతీ్‌షకుమార్‌. డైరెక్టర్లు అభిలాష్‌, ఓంప్రకాష్‌ కామ్లే పాల్గొన్నారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది. తెలంగాణతో పాటు రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించకున్నారని ఆలయ చైర్‌పర్సన్‌ కుర్వ గాయత్రి తెలిపారు. అయితే ఎండలు దంచికొడుతున్న తరుణంలో భక్తులకు మంచినీళ్లు కరువయ్యాయి. దీంతో దుకా ణాల్లో నీరు కొనుగోలు చేసి తాగాల్సి వచ్చింది. మరుగుదొడ్లు కూడా సరిపోను లేవు. గత ఏడాది నిర్మాణం ప్రారంభించినా పూర్తి చేయలేదు. వలంటీర్లు లేకపోవడంతో భక్తులకు సరైన సేవలు అందడం లేదు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రాఫిక్‌ను చక్కదిద్దలేక ఓ దశలో పోలీసులు చేతులెత్తేశారు.

Updated Date - Feb 20 , 2024 | 11:55 PM