ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:00 AM
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.
- క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ప్రజాప్రతినిధులు
- జిల్లాలో వంద శాతం పోలైన ఓట్లు
గద్వాల, మార్చి 28 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జడ్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 225 మంది (100 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏర్పాటు చేసుకున్న క్యాంపుల నుంచే ఓటర్లు బస్సుల్లో నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అందరూ ఓట్లు వేసేంత వరకు ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రం ఆవరణలోనే ఉన్నారు. చివరగా నెట్టంపాడు ఎంపీటీసీ సభ్యురాలు తిప్పమ్మతో ఓటు వేయించిన తర్వాతనే బయటకు వెళ్లారు. అదే సమయంలో జడ్పీ చైర్పర్సన్ సరిత ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 గంటలకు మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ఆధ్వర్యంలో, ఆ వెంటనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓట్లు వేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఆధ్వర్యంలో అలంపూర్ ప్రజా ప్రతినిధులు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. మొదట ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఓటు వేయగా, మిగిలిన ప్రజా ప్రతినిధులు ఓటు వేసి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లారు. చిట్టచివరగా బీజేపీ ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోవడంతో వంద శాతం ఓటింగ్ పూర్తయ్యింది.
బీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం : చైర్పర్సన్ సరిత
గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు, నిధులను కేటాయించక ప్రజాప్రతినిధులను అవమానాలకు గురి చేసిందని జడ్పీ చైర్పర్సన్ సరిత విమర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు అందరూ బీఆర్ఎస్కు బుద్ధి చెప్పేందుకు కట్టుబడి ఉన్నారని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.