Share News

ప్రభుత్వ హామీల అమలుకు పోరాటం చేద్దాం

ABN , Publish Date - Jul 31 , 2024 | 10:58 PM

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరాట కార్యక్రమంలో పాల్గొనాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ డివిజన్‌ కార్యదర్శి సలీం పిలుపునిచ్చారు.

ప్రభుత్వ హామీల అమలుకు పోరాటం చేద్దాం
మాట్లాడుతున్న సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ డివిజన్‌ కార్యదర్శి సలీం

- సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ డివిజన్‌ కార్యదర్శి సలీం

ఊట్కూర్‌, జూలై 31 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరాట కార్యక్రమంలో పాల్గొనాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ డివిజన్‌ కార్యదర్శి సలీం పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలన పోయిన పదేల్ల తర్వాత కాంగ్రెస్‌ పాలన వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలతో పాటు అనేక వాగ్దానాలు చేసిందన్నారు. రేషన్‌ కార్డులు, ఇంటి స్థలం, ఇండ్లు, రుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల జీవన భృతి, కౌలు రైతులకు రైతు భరోసా, ఉద్యోగ క్యాలెండర్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పోడు సాగు భూములకు పట్టాలు ఇస్తామని ఇలా ఎన్నో వాగ్దాలు చేసిందని వివరించారు. కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు వావస్తున్నా వాగ్దాలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఇండ్ల కోసం, ఇంటి స్థలాల కోసం పేదలు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని అన్నారు. రేషన్‌ కార్డులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అందుకే ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ పార్టీ నేడు తహసీల్దార్‌ కార్యాలయం ముందు, ఎనిమిదవ తేదీన కలెక్టరేట్‌ ముందు ప్రదర్శన, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిందని తెలిపారు. అదే విధంగా ఆగస్టు 21న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు నివ్వడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. సమావేశంలో డివిజన్‌ నాయకులు కిరణ్‌, భగవంతు, వెంకట్‌రెడ్డి, రామాంజనేయులు, కృష్ణయ్య, భాస్కర్‌, వై.రాజు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 10:58 PM