బుర్రవీణ కళకు జీవం పోస్తున్న కొండప్ప
ABN , Publish Date - Jan 26 , 2024 | 11:11 PM
అంతరించిపోతున్న బుర్రవీణ వాయిద్య కళకు నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప జీవం పోస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీకి ఎంపిక చేయడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమౌతోంది.
అత్యున్నత పురస్కారం పద్మశ్రీ రావడంపై ఆనందం
ఈ కళ ద్వారానే తాతల కాలం నుంచి జీవనోపాధి
తనతోనే అంతరించి పోకుండా మనవడికి శిక్షణ
నారాయణపేట టౌన్, జనవరి 26: అంతరించిపోతున్న బుర్రవీణ వాయిద్య కళకు నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప జీవం పోస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీకి ఎంపిక చేయడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమౌతోంది. ఈ సందర్భంగా కొండప్ప సంతోషం వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి జీవనోపాధి కోసం ఈ కళను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా చనిపోయినప్పుడు, శుభ కార్యాలు ఉన్నప్పుడు బుర్రవీణ వాయిస్తూ తత్వాలు, బుర్రకథ చెబుతూ వారిచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ బుర్రవీణ వాయిద్యంపై ఎవరికీ అవగాహన లేదని, ఇలాంటి కళను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కళ అంతరించి పోకుండా ఉండేందుకు తన మనుమడు మనోజ్కు శిక్షణ ఇస్తున్నట్లు కొండన్న తెలిపారు. గతంలో పలు టీవీ ఛానళ్ల వారు తన బుర్రవీణ వాయిద్య కళను ప్రసారం చేశారని, బలగం సినిమాలో ఓ పాటను కూడా పాడానని అన్నారు. అయినా పెద్దగా గుర్తింపు రాలేదన్నారు.
గణతంత్ర వేడుకల్లో సన్మానం
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత దామరగిద్దకు చెందిన కొండప్పను కలెక్టర్ శ్రీహర్ష, జడ్పీ చైర్పర్సన్ వనజ, అదనపు కలెక్టర్లు మయాంక్ మిట్టల్, అశోక్ కుమార్, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డిలు పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొండప్ప తన బుర్రవీణ వాయిస్తూ, బలగం సినిమాలోని అయ్యో శివుడా ఏమాయే అనే పాటను పాడి ఆకట్టుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ కొండప్పను సన్మానించారు. కొండప్ప కళను గుర్తించి, పద్మశ్రీ పురస్కారం కోసం నెల రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు శాంతకుమార్ తెలిపారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు సాధించి ఉమ్మడి జిల్లాకే గర్వకారణమని అన్నారు.