కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Feb 12 , 2024 | 11:06 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు ఇవ్వకుండా ద్రోహం చేసిన కేసీఆర్ కృష్ణా జలాలపై నల్గొండలో బహిరంగ సభ నిర్వహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు.
![కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం](https://media.andhrajyothy.com/media/2023/20231205/7npt12_a3e61609cd.gif)
నారాయణపేట, ఫిబ్రవరి 12 : ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు ఇవ్వకుండా ద్రోహం చేసిన కేసీఆర్ కృష్ణా జలాలపై నల్గొండలో బహిరంగ సభ నిర్వహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సోమవారం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ గౌస్ ఆధ్వర్యంలో పేట సత్యనారాయణ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి, మాట్లాడారు. కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. కేసీఆర్ గత పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టుపై వివక్ష చూపి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 40శాతం కూడా పూర్తి కాలేదని, కృష్ణా జలాలను అక్రమంగా ఆంధ్రాకు దోచిపెట్టారని, పాలమూరు జిల్లాకు సాగు నీరు ఇవ్వకుండా అన్యాయం చేశారని, నేడు కృష్ణా జలాలు అందడడం లేదని సిగ్గు లేకుండా బహిరంగ సభ పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే పేట - కొడంగల్ ఎత్తిపోతలకు నిధులు కేటాయించడం నిబద్ధతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి, సలీం, మనోహర్ ప్రసాద్, లిఖి రఘు, కల్యాణ్, నర్సిములు, రవి, శంకర్, నర్సిములు గౌడ్, యూసూఫ్ పాల్గొన్నారు.