ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:39 PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాల యాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు.
![ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం](https://media.andhrajyothy.com/media/2024/20240530/34_Gdl2_c703d33bed.jpg)
- జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ బీఎం సంతోష్
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గద్వాల న్యూటౌన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాల యాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ బీఎం సంతోష్ హాజరైయ్యారు. ముందుగా పోలీసు బలగాల గౌరవ వందనం స్వీక రించి, జిల్లా యంత్రాంగం తరుపున ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదేండ్లు నిండాయని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోంద న్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించినట్లు తెలి పారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నుంచి రూ. 10 లక్షలకు పెంచిందన్నారు. గృహాలకు ఉచితంగా విద్యుత్తును అందించే గృహజ్యోతి, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేసిందన్నారు. 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్- 1, 2, 3, 4 ఉద్యోగాల నియామకాలపై దృష్టి సారించిందన్నారు. త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసిందన్నారు. యాసంగి పంటలకు పెట్టుబడి సాయంంగా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికి రైతు భరోసా నిధులు కోటీ 57 లక్షల ఎకరాలకు రూ. 7,625 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చి దిద్దేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఏకరూప దుస్తుల తయారీ పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఆర్డీవో రామ్చందర్, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఏవో వీరభద్రప్ప పాల్గొన్నారు.