ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Mar 16 , 2024 | 10:57 PM
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు.
![ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి](https://media.andhrajyothy.com/media/2024/20240313/52npt16_6c88a8ff98.gif)
- అధికారులు, ప్రజలు సహకరించాలి
- కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ యోగష్ గౌతమ్
నారాయణపేటటౌన్,మార్చి16ః ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నిబంధనలను కలెక్టర్ విలేకరుల సమావేశంలో వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29, మే 13న ఎన్నికలు నిర్వహించి జూన్ 4న కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను, గోడలపై రాతలను 48 గంటలలోగా తొలగించాలని, ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన చట్ట ప్రకారం కేసులు తప్పవని తద్వారా భవిష్యత్తులో వారికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. మంగళవారం నుంచి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు మెసెజ్లను ఫార్వర్డ్ చేస్తే సంబంధిత వ్యక్తులపైనా, అడ్మిన్పై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.