ఎన్నికల ఖర్చును జాగ్రత్తగా నమోదు చేయాలి
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:47 PM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వ్యయాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్ అధికారులను ఆదేశించారు.
- నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు సౌరభ్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 19 : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వ్యయాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్ అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమితుడైన సౌరభ్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును ఎలా లెక్కిస్తున్నారు, ఎలా నమోదు చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల అధికారుల బృం దాలు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని, అను మా టనాస్పద ఖాతాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ఎస్సీ అకౌంటింగ్ టీం సభ్యులు సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తిం చాలన్నారు. అభ్యర్థి తరఫున ప్రచారానికి పార్టీ ఖర్చుచేసే ప్రతీ పైసాను పకడ్బందీగా ఎన్నికల వ్యయం కింద చూపించాలని ఆదేశించారు. అనంతరం సీ-విజిల్ యాప్, టోల్ఫ్రీ నెంబర్ 1950 కాల్సెంటర్, గ్రీవెన్స్ కమిటీ, మీడియా కేంద్రాను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. నిఘా కోసం నియమించిన ప్లయింగ్ స్వ్కాడ్, ఎస్ఎస్టీ బృందాలను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన స్ర్కీన్లను పరిశీలించారు. మీడియా ప్రకటనలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన ధరల ప్రకారం వ్యయం నమోదు చేయాలని సూచించారు. ఎంసీఎంసీ కమిటీ సభ్యులు ప్రతీ రోజూ దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్పై దృష్టి సారించాలని సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, డీఆర్వో రామ్చందర్, అదనపు ఎస్పీ గుణశేఖర్, నోడల్ అధికారులు, ఎంసీఎంసీ, అకౌంటింగ్ బృందాల సభ్యులు పాల్గొన్నారు.