వ్యవసాయ రంగంపై వివక్ష విడనాడాలి
ABN , Publish Date - Jul 31 , 2024 | 11:14 PM
వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య డిమాండ్ చేశారు.
- ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య
- గద్వాల పాతబస్టాండ్ సర్కిల్లో ధర్నా
గద్వాల టౌన్, జూలై 31 : వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 25 శాతం నిధులు కేటాయించాలన్నారు. ఎస్కేఎం ఆధ్వ ర్యంలో గద్వాల పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్లో బుధవారం ధర్నా నిర్వహించి, కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ బడ్జెట్లో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం, రైతు రుణమాఫీతో పాటు రైతుల ఆత్మహత్యల నివారణపై ప్రస్తావించకపోవడం దౌర్భాగ్యమన్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సుల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నది ఈ బడ్జెట్తో మరోసారి స్పష్టమైం దన్నారు. నూతన వంగడాల అభివృద్ధి, పరిశోధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పించడం సరి కాదన్నారు. ఫసల్ భీమాకు, ఎరువుల సబ్సిడీకి నిధు లు తగ్గించడం రైతులను మోసగించడమేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టు కూ జాతీయ హోదా కల్పించకపోవడం విచారకరమ న్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్పరం చేసేం దుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు బడ్జెట్ మరింత ఊతమిచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి, సీఐటీయూ నాయకులు గోపాల్యాదవ్, వెంకటస్వామి, గోపాల్రావు, సత్యారెడ్డి, తిమ్మప్ప, మౌలాలి, సురేష్, నరసింహ, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.