పాలమూరును ఎడారి చేసే కుట్ర
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:26 PM
బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు రాష్ర్టాన్ని పాలించి.. పాలమూరును ఎడారి చేసేందుకు కుట్రలు పన్నిందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల మేడిగడ్డ పర్యటన సందర్భంగా మహబూబ్నగర్ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కలిసి శుక్రవారం చలో పాలమూరు- రంగారెడ్డి పర్యటన నిర్వహించారు.
అందుకే బీఆర్ఎ్స కృష్ణా నదీజలాల్లో వాటా దక్కకుండా చేసింది
ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే వేడుక చూసి సహకరించింది
577 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే కేంద్రం వద్ద ఒప్పుకుంది
ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఒప్పుకున్నవీ వాడుకోని దుస్థితి
రిజర్వాయర్ల పర్యటనలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి
మహబూబ్నగర్, మార్చి 1, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు రాష్ర్టాన్ని పాలించి.. పాలమూరును ఎడారి చేసేందుకు కుట్రలు పన్నిందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల మేడిగడ్డ పర్యటన సందర్భంగా మహబూబ్నగర్ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కలిసి శుక్రవారం చలో పాలమూరు- రంగారెడ్డి పర్యటన నిర్వహించారు. కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలు 2009లో ఓట్లు వేసి గెలిపించినందుకు ఆ ప్రజలనే మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. 2015లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి.. కుర్చీ వేసుకుని కూర్చుని మరీ మూడేళ్లలో పనులు పూర్తి చేస్తానని చెప్పారన్నారు. 2024 వచ్చినా 50 శాతం కూడా పనులు పూర్తికాని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు కృష్ణానదిలో ఉమ్మడి ఏపీకి 812 టీఎంసీల నీటి వాటా ఉండేదని, కానీ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ర్టానికి 299 టీఎంసీలు మాత్రమే నీటివాటా దక్కిందన్నారు. అంతర్జాతీయ నదీ జలాల చట్టం ప్రకారం నది పరివాహకం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటే.. ఆ ప్రాంతానికే నీళ్లు దక్కాలని నిబంధన ఉందన్నారు. తెలంగాణలో కృష్ణానదికి 68 శాతం పరివాహకం ఉండగా.. న్యాయంగా 577 టీఎంసీల నీటివాటా దక్కాలన్నారు. కానీ అప్పటి సీఎం కేసీఆర్.. ఆంధ్రా పాలకుల మెప్పుకోసం, వారి మోచేతి నీళ్లు తాగి, కేవలం 299 టీఎంసీల వాటాకే ఒప్పుకున్నారని విమర్శించారు. ఈ రకంగా పాలమూరు జిల్లాను ఎడారిని చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల ఉన్న 299 టీఎంసీల నీటివాటాలో కేవలం 212 టీఎంసీల నీటినే తెలంగాణ వినియోగించుకుంటోందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును బొందలగడ్డ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు తమ నాయకులను మేడిగడ్డకు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఒకప్పుడు కేసీఆర్ ప్రపంచంలో ఏడో వింతగా కాళేశ్వరాన్ని అభివర్ణించారని, ఇప్పుడు ఆయనకు మేడిగడ్డ బొందలగడ్డగా అనిపిస్తుందంటే ఆయన తప్పును ఒప్పుకునట్లేనని అన్నారు. ప్లానింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్లో లోపాల వల్లనే మేడిగడ్డ కుంగిందన్నారు. అదే మెథడాలజీతో నిర్మించిన దిగువ బ్యారేజీలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు. అన్నారంలో కూడా ఇప్పటికే బుంగలు పడుతున్నాయని తెలిపారు. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్కు నీటిని తరలించవద్దని ఉన్నప్పటికీ.. సంగమేశ్వరం, రాయలసీమ లిఫ్టులు చేపట్టి ఏపీ 11 టీఎంసీల నీటిని పెన్నా బేసిన్కు తరలించేందుకు చూస్తుంటే కేసీఆర్ చోద్యం చూశారని విమర్శించారు. ఆ ప్రాజెక్టుల టెండర్ల సమయంలో తాను కేసీఆర్కు లేఖ రాశానన్నారు. ఆ సమయంలోనే జరిగిన అపెక్స్ కౌన్సిల్లో అడ్డుకోవాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తానన్న కేవలం రోజాకు ఇచ్చిన మాట కోసమే కేసీఆర్ ఇష్టారీతిన వ్యవహరించారని తెలిపారు. రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి.. ‘నేనే నిర్మాత, నేనే ఇంజనీర్, నాదే డిజైన్’ అని చెప్పి కాళేశ్వరాన్ని నాశనం చేశారని అన్నారు. పాలమూరు - రంగారెడ్డిలో కూడా నాసిరకంగా పనులు చేపట్టినట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారని అన్నారు. అలాగే సీపేజీలు కూడా వస్తున్నాయని, మాజీ ఎమ్మెల్యే పనులు చేసి.. డబ్బులు దండుకున్నారని విమర్శించారు. అసమర్థ ముఖ్యమంత్రికి చెంచాలుగా ఉన్న శ్రీనివా్సగౌడ్, నిరంజన్రెడ్డి పాలమూరు నీళ్లు తరలిపోతుంటే ఏమాత్రం జ్ఞానం లేకుండా ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. ఆనాడే రాజీనామా చేసి ఉంటే.. పాలమూరు ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారని తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పీజేఆర్ పోరాటం చేశారని, కానీ 40 వేల నుంచి 98,500 క్యూసెక్కులకు పెంచినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రమాదాన్ని చిన్నదిగా చూపడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని, ఆ నెపాన్ని కాంగ్రె్సపైకి నెట్టడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ కింద ఉన్న బ్యారేజీలు కూడా అదే విధంగా ఉన్నాయని, టోటల్ బ్యారేజీలే ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు.
రైతులకు న్యాయం చేయలే: అనిరుధ్రెడ్డి
ఉదండాపూర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు గత ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే న్యాయం చేయలేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి విమర్శించారు. ఆర్ అండ్ ఆర్ అమలు చేయలేదన్నారు. ఉదండాపూర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ఆర్అండ్ఆర్ సమస్యపై మాట్లాడలేదని, తాను మొన్న అసెంబ్లీలో మాట్లాడటంతో పాటు సీఎంను కలిశానని తెలిపారు. కాంట్రాక్టర్కు ఇచ్చే అంచనా వ్యయాలు పెరిగాయని, కానీ రైతుల ప్యాకేజీ మాత్రం పెంచడం లేదన్నారు. 40 వేల ఎకరాల భూమి పోతే నాలుగు గుంటలు కూడా రైతులకు భూమి ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్కు దమ్ముంటే పాలమూరుకు వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. లక్ష్మారెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉదండాపూర్కు రావాలని అన్నారు.
ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు: మధుసూదన్రెడ్డి
బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకున్నారని, కానీ నీళ్లు తెచ్చే పనులు మాత్రం చేయలేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల కృష్ణానదిలో నీటి వాటాను దక్కించుకోవడం లేదని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి 80 శాతం పూర్తయ్యిందని బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో కూర్చుని మాట్లాడుతున్నారని, కానీ 50 శాతం కూడా పూర్తి కాలేదని అన్నారు. ప్రాజెక్టు పేరుతో ఒండ్రుమట్టి దోచుకున్నారన్నారు. పాలమూరు జిల్లాలో అందుతున్న నీరు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లేనన్నారు.