Share News

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:52 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోమారు రైతులను రైతు పండుగ పేరుతో మోసం చేస్తుందని మునిసి పల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ అన్నారు.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌
మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు

భూత్పూర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోమారు రైతులను రైతు పండుగ పేరుతో మోసం చేస్తుందని మునిసి పల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ అన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతుందని, రైతులకు ఈ పది నెలల్లో ఏం సాధించారని రైతు పండుగలు చేస్తున్నారని బస్వరాజుగౌడ్‌ విమర్శించారు. రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని, ఆరు గ్యారెంటీలను ఎగనామం పెట్టి సామాన్య ప్రజలను తప్పు తోవ పట్టించడానికి ఇది కొత్త నాటకమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన రైతు సంక్షేమ పథకాలే నేడు గ్రామాల్లో దర్శనం ఇస్తున్నాయన్నారు. ఆయిల్‌ ఫాం తోటలను రైతులకు అందించి ఆదుకున్న ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కిందని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను స్టాళ్లల్లో ప్రదర్శించి అంతా మేమే చేశామని చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుందన్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌ కదిరె అశోక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు సత్యనారాయణ, నారాయణగౌడ్‌, షాదిక్‌ భాయ్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అద్యక్షుడు సురేష్‌కుమార్‌గౌడ్‌, సాయిలుగౌడ్‌, అశోక్‌గౌడ్‌, వెంకట్‌రాజు, యాసిన్‌పాషా, ఆగిరి సత్యం, తిరుపతయ్యగౌడ్‌, ఆగిరి వెంకటేష్‌, రాకేష్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:52 PM