పిల్లలను బడులకు పంపాలి
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:43 PM
తల్లిదండ్రులు పిల్లలను పనులకు కాకుండా పాఠశాలలకు పంపాలని జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి, మండల ప్రత్యేకాధికారి ప్రియాంక సూచించారు.
- జిల్లా ఉపాధి కల్పనా అధికారి ప్రియాంక
గట్టు, సెప్టెంబరు 21 : తల్లిదండ్రులు పిల్లలను పనులకు కాకుండా పాఠశాలలకు పంపాలని జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి, మండల ప్రత్యేకాధికారి ప్రియాంక సూచించారు. శనివారం ఆలూరు గ్రామ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, పలు సూచనలు చేశారు. అంతకుముందు గ్రామ సమీపంలో పత్తి చేలలో పనులు చేస్తున్న పిల్లల వద్దకు వెళ్లి వారి తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించి పిల్లలను బడికి పంపే విధంగా ప్రోత్సహించారు. అనంతరం పాఠశాలలో డిజిటల్ బోర్డులో షార్ట్ ఫిలింల ద్వారా చదువు యొక్క ప్రాధాన్యతతో పాటు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ వల్ల జరుగుతున్న నష్టాలతో పాటు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను వారికి చూపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరితారాణి, ఎంపీడీవో చెన్నయ్య, ఎంఈవో నర్సింహా, హెచ్ఎం నాగరాజు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ అఫ్జల్, గ్రామ మహిళా సంఘం సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి
కేటీదొడ్డి : ప్రతీ గ్రామంలో బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని, పిల్లలతో పనులు చేయించుకొని వారి భవిష్యత్ను నాశనం చేయొద్దని ఎంఈవో సురేష్ అన్నారు. శనివారం మండలంలోని కేటీదొడ్డి, కొండాపురం గ్రామాల్లోని పత్తి పొలాల వెంట ఆయన తిరిగి బడీడు పిల్లలతో పనులు చేయించుకుం టున్న వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లా సమన్వయ అధికారి హంపయ్య, మండల నోడల్ అధికారి వెంకటేశ్వర్రావు, హెచ్ఎం మురళీధర్, ఉపాధ్యాయులు, ఎంవీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.