వృద్ధాశ్రమాల అవసరం లేకుండా చూడాలి
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:15 PM
వృద్ధులైన తల్లిదండ్రులను తమ పిల్లలు బాధ్యతగా బాగోగులు చూసుకునేలా అవగాహన కల్పించి వృద్ధాశ్రమాల అవసరం లేకుండా చూడాలని మహిళా సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ అవిటి నాగశ్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
![వృద్ధాశ్రమాల అవసరం లేకుండా చూడాలి](https://media.andhrajyothy.com/media/2024/20240604/50mbn8_df1c729731.jpg)
- మహిళా సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ అవిటి నాగశ్రీ
మహబూబ్నగర్ టౌన్, జూన్ 8 : వృద్ధులైన తల్లిదండ్రులను తమ పిల్లలు బాధ్యతగా బాగోగులు చూసుకునేలా అవగాహన కల్పించి వృద్ధాశ్రమాల అవసరం లేకుండా చూడాలని మహిళా సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ అవిటి నాగశ్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక పారిశ్రా మిక వాడలోని సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో శనివారం జరిగిన మహిళా సీనియర్ సిటిజన్ ఫోరం సమావేశంలో ఆమె మాట్లాడారు. నేటి సమాజంలో తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులను పిల్లలు తమ పేర రాయించుకొని వారిని రోడ్డు పాలు చేస్తున్నారని, ఎంతో మంది వృద్ధులు తమ బాధలను వెళ్లగక్కుకోలేక దిగమింగి బతుకు లీడుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధుల రక్షణ కోసం రూపొందించిన 2007 చట్టాన్ని కఠినంగా అమలు పరిచి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఊర్మిళాదేవి, చంద్రకళ, ఇందిర, సీనియర్ సిటిజన్ ఫోరం గౌరవాధ్యక్షుడు అక్కినేని నారాయణరావు, అధ్యక్షుడు జగపతిరావు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, మహిళలు పాల్గొన్నారు.