మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:54 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ వైద్యులను ఆదేశించారు.

- కలెక్టర్ బీఎం సంతోష్
- ధరూరు ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
ధరూరు, జూలై 8 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ వైద్యులను ఆదేశించారు. ధరూ రు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హజరు పట్టికను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వైద్యం కోసం ప్రతీ రోజు ఎంత మంది వస్తున్నారు, ఇన్ పేషెంట్స్ ఎంత మంది ఉన్నారు తదితర వివరాలను తెలుసుకు న్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని, వంద శాతం సాధా రణ కాన్పులు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశిం చారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వ్యాధులపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని, డెంగీ, మలేరియా తదితర వ్యాధులకు అవసరమైన మందు లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఫార్మసీ స్టోర్ను పరిశీలించి వైద్య పరీక్షల వివరాలను తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్, సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు. ఎన్సీడీ కార్యక్రమం ద్వారా 30 సంవ త్సరాలకు పైబడిన వారిని గుర్తించి బీపీ, షుగర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసర మైన మందులను అందించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పిం చాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకట్రాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆనందయ్య, ఫార్మసిస్ట్ శ్రీహరి, ల్యాబ్ టెక్నీషియన్ రామస్వామి పాల్గొన్నారు.
‘ఇంటింటా ఇన్నోవేటర్’ పోస్టర్ విడుదల
తెలంగాణ రాష్ట్ర అవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఇంటింటా ఇన్నోవేటర్ - 2024’ పోస్టర్ను కలెక్టర్ బీఎం సంతోష్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆవిష్కర్తలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలకు సాధికారత కల్పిం చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఆవిష్కరణలలో ఉత్తమమైన వాటికి ఆగస్టు 15న అవార్డు ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ఈ ఏడాది జిల్లాకు ఒకరి చొప్పున 33 మంది యువ నిపుణులతో ప్రత్యేక బృందాన్ని నియమిస్తున్నట్లు తెలిపారు. వీరు ఇన్నోవేషన్ మిత్రలుగా మూడు నెలల పాటు (జూలై, సెప్టెంబర్ 2024) క్షేత్ర స్థాయిలో సమన్వయకర్తలుగా పని చేస్తారని తెలిపారు. జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు, గ్రామీణ ప్రజలను కార్యక్రమంలో భాగస్వాములను చేయడంలో వీరు కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. తెలంగాణ మారుమూల గ్రామాల నుంచి సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావడమే వారి లక్ష్యమన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ - 2024కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ సులువుగా, అనుకూలంగా ఉండే లా రూపొందించినట్లు తెలిపారు. ఆవిష్కరణలను నమోదు చేసుకునేందుకు గడువు వచ్చేనెల మూడవ తేదీ వరకు ఉంటుందని వివరించారు.
ఫిర్యాదులకు సత్వర పరిష్కారం
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 45 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ప్రజలు ఇస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతల మేరకు పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వర్లు, నర్సింగరావు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో పోలీసు నిఘా
కలెక్టరేట్ ఆవరణలో పట్టణ రెండవ ఎస్ఐ రాము ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ గతంలో కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. గత సోమవారం కూడా అయిజ మండలం గుడిదొడ్డికి చెందిన వడ్డె పరశురాం అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ముందుస్తుగా పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ప్రజావాణికి వచ్చే వారి సంచులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి పంపిస్తున్నారు.