మొక్కుబడిగా కు.ని. ఆపరేషన్లు
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:08 PM
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నారాయణపేట జిల్లాలో మొక్కుబడిగా కొనసాగుతున్నాయి.
- నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
- అరకొర వసతులతో ఆపరేషన్ థియేటర్లు
నారాయణపేట, జనవరి 29 : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నారాయణపేట జిల్లాలో మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు అధిగమించలేక పోతున్నారు. జిల్లాలో మూడేళ్లుగా 9,600 మందికి కు.ని. ఆపరేషన్లు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకోగా, కేవలం 902 కు.ని ఆపరేషన్లు మాత్రమే జరిగాయంటే అధికారుల పనితీరు ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెసెక్టమి, ట్యూబెక్టమి ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆశించిన మేర ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, వైద్యుల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు అరకొర వసతులతో అస్తవ్యస్థంగా ఉండడంతో కు.ని. ఆపరేషన్ల నిర్వహణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. పేట జిల్లా ఆసుపత్రితో పాటు మక్తల్, మద్దూర్, కోస్గి ప్రభుత్వ ఆసుపత్రులు, 13 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో రెండేళ్లుగా శిక్షణ పొందిన వైద్యులు లేక ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని వైద్యసిబ్బంది చెప్పుకొస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లలో వసతులు అరకొరగా ఉండడం, గదుల కొరత ఉందని తీవ్రంగా వేధిస్తోంది. 2020లో 3,200 కు.ని ఆపరేషన్లను నిర్వహించాలని లక్ష్యం పెట్టుకోగా, 390 కు.ని ఆపరేషన్లు మాత్రమే జరిగాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30, ప్రైవేటు ఆసుపత్రుల్లో 44 కు.ని ఆపరేషన్లు నిర్వహించగా, 316 కు.ని ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. అదే విధంగా 2021లో 3,200 కు.ని ఆపరేషన్లు లక్ష్యం పెట్టుకోగా, 210 కు.ని ఆపరేషన్లు మాత్రమే జరిగాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20, ప్రైవేటు ఆసుపత్రుల్లో 18 కు.ని ఆపరేషన్లు నిర్వహించగా, 172 కు.ని ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. 2022లో 3,200 లక్ష్యం పెట్టుకోగా, 302 కు.ని ఆపరేషన్లు మాత్రమే జరిగాయి. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 141, ప్రైవేటు ఆసుపత్రుల్లో 124 కు.ని ఆపరేషన్లు నిర్వహించగా, 37 కు.ని ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు కు.ని ఆపరేషన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.