ప్రతి శుక్రవారం డ్రై డేను నిర్వహించాలి
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:32 PM
నాగర్కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామాన్ని శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
కందనూలు, సెప్టెంబరు 13 : నాగర్కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామాన్ని శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో నిర్వహించే డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించి పల్లె దవాఖానాను పరిశీలించారు. ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల నివారణకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఓపెన్ ప్లాట్లు, జనావాసాల మధ్య ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లు గమనిస్తే ఆయిల్బాల్స్ వేయాలని, గంబూషియా చేప పిల్లలను వదలాలని పిచికారి మందు వేయించాలని, దోమలు వ్యాప్తి చెందకుడా ఫాగింగ్ చేయించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని, వ్యాధుల పరిస్థితిపై రోజువారిగా నివేదికలు తెప్పించుకుని నిశిత పర్యవేక్షణ జరపాలని సూచించారు. డెంగ్యూ కేసు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతీ ఇంటిని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సందర్శించాలని, ఇంటి లోపల, పరిసరాల్లో నిల్వ నీరు చెత్తాచెదారం లేకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ, మలేరియా వంటి ప్రమాదకరమైన విష జ్వరాల వల్ల అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పల్లె దవాఖానాను పరిశీలించి ప్రతిరోజు ఔట్ పేషెంట్లు ఎంతమంది వస్తారు, పల్లె దవాఖానాలో ఉన్న మందుల వివరాలు దవాఖానాకు వచ్చే ప్రజల వివరాలను వైద్యుడు రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు డెంగీ, మలేరియా, చికెన్గున్యాలాంటి వ్యాధులపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్కు వైద్యాధికారులు వివరించారు. కలెక్టర్ వెంట ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రవినాయక్, నాగర్కర్నూల్ ఎంపీడీవో కోటేశ్వర్, రెడ్క్రాస్ సెక్రటరీ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించాలి
పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో 10జీపీఏ సాధించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను, పాఠ్యసుస్తకాల, నోటుబుక్కులు, పంపిణీ, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించేలా విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజన వంట చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి వండే బియ్యంలో పురుగులు లేకుండా శుభ్రపర్చాలని సూచించారు. రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. కలెక్టర్ వెంట ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రవినాయక్, నాగర్కర్నూల్ ఎంపీడీవో కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.