Share News

పెట్టుబడి సాయం అందేదెన్నడో..?

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:10 AM

జిల్లాలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలుచేసిన రైతు బంధు పథకానికి బదులు రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

పెట్టుబడి సాయం అందేదెన్నడో..?

- మరింత ఆలస్యంకానున్న ‘రైతు భరోసా’

- విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ ఉప సంఘం

- జూలై 15లోగా నివేదిక ఇవ్వనున్న ఉప సంఘం

- రుణ మాఫీపైనే ప్రభుత్వం దృష్టి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలుచేసిన రైతు బంధు పథకానికి బదులు రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను విధివిధానాలను ఖరారు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడంతో పెట్టుబడి సాయం ఆలస్యంగానే అందనున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి 15 వేల రూపాయలు, కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని, రైతు కూలీలకు 12 వేల రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించింది. అంతకుముందుకు ఇదే పథకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రబుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసింది. పట్టా కలిగిన వారందరికి సీజన్‌కు 5 వేల చొప్పున రెండు సీజన్లకు 10 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఇందులో కౌలు రైతులకు ఎలాంటి సాయాన్ని అందజేయ లేదు. ఈ పథకం అమలు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అనుసంధానం చేసుకుని నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈ క్రమంలో సాగులో ఉన్న, సాగులో లేని భూములు, రహదారులు, ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు, నాలా మార్పిడి చేయకుండా వెలసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండానే అప్పటి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలుచేసింది. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షా 46 వేల మంది రైతులకు 136 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పథకాన్ని సవరించి తాము ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలుచేయాలని భావించింది. గడిచిన యాసంగి సీజన్‌లో పాత విధానంలోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది.

ప్రారంభమైన వానాకాలం..

వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పథకాన్ని అమలుచేస్తారా, పాత పథకం ప్రకారమే పెట్టుబడి సొమ్మును ఖాతాల్లో జమచేస్తారా అని రైతులు చర్చించుకుంటున్నారు. దానికంటే ముందు పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15వ తేదీ వరకు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈనెల 21న నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ముందుగా రుణ మాఫీ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ్యులుగా ఉప సంఘాన్ని నియమించారు. ఈ ఉప సంఘం రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి జూలై 15లోపు నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఆ నివేదికను వచ్చే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించి విధివిధానాలను ఖరారు చేయనున్నది. ఈ పథకం అమలుచేసేందుకు 10 ఎకరాల వరకు పరిమితం చేసే సూచనలు కనబడుతున్నాయి. రహదారులు, కొండలు, గుట్టలు, బంచరాయి భూములు, సాగుకు యోగ్యం కానీ భూములను, ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను, ప్రభుత్వ ఉద్యోగుల భూములను పథకం నుంచి తొలగించనున్నారు. అలాగే కౌలు రైతులు కౌలుకు చేస్తున్న భూముల యజమానులకు గాకుండా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని సదరు కౌలు రైతులకు కొంత, పట్టాదారులకు కొంత సాయాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. విధివిఽధానాలు ఖరారు అయిన తర్వాతనే ఈ సీజన్‌ నుంచి గానీ వచ్చే యాసంగి సీజన్‌ నుంచి గానీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించే అవకాశాలున్నాయి.

Updated Date - Jun 24 , 2024 | 01:10 AM