Share News

‘పరపతి’కి నిరీక్షణ

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:39 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తరణ ఎదురు చూపులకే పరిమితమైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను విభజించడంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు.

  ‘పరపతి’కి నిరీక్షణ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తరణ ఎదురు చూపులకే పరిమితమైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను విభజించడంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఇప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. 2019లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఐదు వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పంపిన ప్రతిపాదనలకు ఈ ప్రభుత్వంలోనైనా మోక్షం లభిస్తుందని ఆశించినా వరుస ఎన్నికలతో పరపతి సంఘాలు పెరిగే అవకాశాలు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. గతేడాది మేలో కేంద్ర మంత్రి మండలి దేశంలో వచ్చే ఐదేళ్లలో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామానికో సంఘాన్ని ఏర్పాటు చేసి రైతులకు 25 రకాల సేవలు అందించాలని నిర్ణయించారు.

జిల్లాలో పరపతి సంఘాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత సంవత్సరం మేలో కేంద్రమంత్రి మండలి నిర్ణయం మేరకైనా పరపతి సంఘాలు పెరుగుతాయని అన్నదాతలు భావించారు. ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఆగిపోయాయి. జిల్లాలో ప్రస్తుతం 24 సహకార సంఘాలు ఉండగా 74,728 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 35,776 మందికి ఓటు హక్కు ఉంది. గత ప్రభుత్వం మండలానికి రెండు సంఘాలు ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలో 13 మండలాలు ఉండగా 24 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా తంగళ్లపల్లి, మర్రిపల్లి, వట్టెంల, వీర్నపల్లి, గర్జనపల్లి, రుద్రంగి సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. కొత్త సంఘాలు ఏర్పడిన తర్వాత సింగిల్‌విండో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా కొత్త సంఘాలు ఏర్పడకముందే ఎన్నికల నిర్వహణ పూర్తి చేశారు. కొత్త సంఘాల ప్రతిపాదనలు మూలనపడ్డాయి. కేంద్రప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుకు నిర్ణయించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర సహకార బ్యాంక్‌ సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసే ఆలోచన చేసింది. సింగిల్‌ విండోలు రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీకి తోడ్పడుతున్నాయి. వీటిని బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం భావించినా ఫలితాలు నామమాత్రంగానే మారాయి.

సొసైటీల్లో 74,728 మంది సభ్యులు

జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో 74,728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12,859 మంది సభ్యులు ఉండగా పెద్దూరు సొసైటీలో 1336, నేరెళ్ల 1257, కోనరావుపేట 6196, కొలనూరు 3018, వేములవాడ 8180, నాంపెల్లి 1191, రుద్రవరం 998, చందుర్తి 3369, సనుగుల 1733, బోయినిపల్లి 910, కోరెం 1694, మాన్వాడ 1163, నర్సింగాపూర్‌ 1684, ఇల్లంతకుంట 3547, గాలిపెల్లి 1680, ముస్తాబాద్‌ 2082, పోత్గల్‌ 7169, గంభీరావుపేట 8183 , కొత్తపెల్లి 3680, ఎల్లారెడ్డిపేట 3864, అల్మాస్‌పూర్‌ 2139 , తిమ్మాపూర్‌ 1597, మానాలలో 199 మంది సభ్యులు ఉన్నారు. సొసైటీలను విస్తరించి వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:39 AM