Share News

నల్లా నీటి కోసం నిరీక్షణ

ABN , Publish Date - May 16 , 2024 | 12:16 AM

మండుతున్న ఎండలతో భూగర్భజలాలు అడుగంటి పోయి బోరుబావులు ఎండిపోతున్నాయి. దీంతో అనేక కాలనీల్లో నగరవాసులు నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. దిగువ మానేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పడిపోయి 5.5 టీఎంసీలకు చేరాయి. తాగునీటికి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నది.

నల్లా నీటి కోసం నిరీక్షణ

కరీంనగర్‌ టౌన్‌, మే 15: మండుతున్న ఎండలతో భూగర్భజలాలు అడుగంటి పోయి బోరుబావులు ఎండిపోతున్నాయి. దీంతో అనేక కాలనీల్లో నగరవాసులు నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. దిగువ మానేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పడిపోయి 5.5 టీఎంసీలకు చేరాయి. తాగునీటికి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నది. ఇటీవలి వరకు కరీంనగర్‌లో ప్రతిరోజూ తాగునీటిని అందించారు. హౌసింగ్‌ బోర్డుకాలనీతోపాటు రాంపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలో 24/7 మంచినీటిని ట్రయల్‌ రన్‌గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుంటే రాబోయే రోజుల్లో నగరమంతటా అందిస్తామన్నారు. గత సంవత్సరం ఆగస్టులో అప్పటి మంత్రి కేటీఆర్‌తో 24/7 తాగునీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. దీనితో నగరంలో ఇక తాగునీటి అవసరాలకే కాకుండా బోరుబావులు, మోటార్లు వాడుకునే అవసరం రాదని ప్రజలు సంతోషించారు. పరిస్థితి మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇబ్బందులతో నీటి నిల్వలు ఖాళీ అయ్యాయి. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు రిజర్వాయర్లతోపాటు చెరువులు, కుంటల్లో నీటి నిలువలు తగ్గిపోయాయి.

ఫ రోజు విడిచి రోజు నీటి సరఫరా..

ఎల్‌ఎండీలో నీటి నిలువలు తగ్గడంతో రోజు విడిచి రోజు నల్లానీరు ఇస్తున్నారు. గతంలో ప్రతిరోజు 55 ఎంఎల్‌డీ నీటిని నగర ప్రజలకు అందించిన మున్సిపాలిటీ ప్రస్తుతం రెండు రోజులకొకసారి నల్లానీటిని ఇస్తున్నప్పటికీ రోజు 55 ఎంఎల్‌డీ నీటిని శుద్దిచేసి సరఫరా చేస్తుంది. రెండురోజుల కొకసారి నల్లా నీరు రావడం, వేసవి కారణంగా నీటి అవసరాలు పెరుగడం, మరోవైపు గతంలో మాదిరిగా కాకుండా 45 నిమిషాల నుంచి గంట సేపు మాత్రమే నళ్లానీటిని ఇస్తుండడంతో సరిపోవడం లేదని ప్రజలు ఆవేదనచెందుతున్నారు. శివారుకాలనీలతోపాటు విలీన డివిజన్లలో తాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నల్లానీరు సరిపడా రావడం లేదని, సమయపాలన లేదని, తక్కువ ప్రెషర్‌తో నళ్లానీరు వస్తోందని ప్రజలు చెబుతున్నారు. రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేసినా గంట సేపు పూర్తి ప్రెషర్‌తో అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని ఇవ్వాలని కోరుతున్నారు.

ఫ తాగునీటి వృథా చేయొద్దు

- మేయర్‌ యాదగిరి సునీల్‌రావు

కరీంనగర్‌కు నీరందిస్తున్న దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండి)లో నీటినిలువలు 5.5 టీఎంసీలకు చేరడంతో రోజు విడిచి రోజు తాగునీటిని అందిస్తున్నాం. ప్రతిరోజు 55 మిలియన్‌ లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని నల్లాలు, ట్యాంకర్ల ద్వారా నగర ప్రజలకు అందిస్తున్నాం. తాగునీటి వృథా చేయకుండా వినియోగించుకోవాలి. ఎల్‌ఎండీలో నీటి నిలువలు 10 టీఎంసీలు దాటితే ప్రతి రోజు అందిస్తాం.

Updated Date - May 16 , 2024 | 12:18 AM