దంచికొట్టిన వాన
ABN , Publish Date - May 08 , 2024 | 12:17 AM
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయింది.
జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
కరీంనగర్ రూరల్, మే 7: మండలంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు విడతల్లో వర్షం దంచి కొట్టింది. పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. చెర్లబూత్కూర్, చామనపల్లి, నగునూర్, జూబ్లీనగర్, మొగ్దుంపూర్, దుర్శేడ్, బొమ్మకల్ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఫ హుజూరాబాద్, శంకరపట్నం, రామడుగు, గంగాధర, మానకొండూర్, చొప్పదండి, చిగురుమామిడి, సైదాపూర్: ఆయా మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యం తడిసింది. ఈదురుగాలులతో కోతకు వచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి. చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసింది. సైదాపూర్ మండలం సర్వాయిపేటలో వేముల నర్సయ్య, వేమల కొంరయ్యల ఇంటి పైకప్పులు లేచిపోయాయి.