అభివృద్ధిని పట్టించుకోని వారికి గుణపాఠం చెప్పాలి
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:36 AM
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలో శుక్రవారం రోడ్షో నిర్వహించారు.
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్రావు
ఇల్లంతకుంట, ఏప్రిల్ 26: అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలో శుక్రవారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీలుగా పనిచేసిన వినోద్కుమార్, బండి సంజయ్కుమార్ ఏనాడూ ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. దేవుడి పేరుతో ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కనీస పరిజ్ఞానం లేని సంజయ్కుమార్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరంకుశంగా పాలన కొనసాగించారన్నారు. అభివృద్దే ధ్యేయంగా పనిచేయడానికి వస్తున్న తనను ఆదిరించాలని కోరారు. రైతుల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని, కొంతమంది నాయకులు చేసే ప్రకటనలు నమ్మవద్దన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తు సంతోషంగా ఉన్నారన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందన్నారు.