గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:46 AM
వేములవాడ పట్టణంలోని గుడి చెరువు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
![గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి](https://media.andhrajyothy.com/media/2024/20240413/4_e27b30517c.jpg)
వేములవాడ, ఏప్రిల్ 16 : వేములవాడ పట్టణంలోని గుడి చెరువు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. వేములవాడ గుడి చెరువులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చెరువు బండ్ పార్క్లో కొనసాగుతున్న నిర్మాణాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్క్, ఇతర నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. పనులు, సుందరంగా, ఆకర్షణీయంగా సంప్రదాయ బద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. పిల్లల ఆట స్థలాలు, వాకింగ్ ఏరియా, ఓపెన్ జిమ్ తదితర పనులన్నీ రానున్న జూన్ మాసం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని, కాంట్రాక్టర్ ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. సూర్య నమస్కారాలు, ఇతర విగ్రహాలకు పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని, అయితే పండుగలు, వరుస సెలవుల కారణంగా పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గుడి చెరువు ఆవరణలో కొనసాగుతున్న శివార్చన స్టేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. శివార్చన స్టేజీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆలయ ఈఈ రాజేష్ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పార్క్ను కలెక్టర్ పరిశీలించారు. పార్క్లో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, మొక్కలు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, బెంచీలు, వివిధ రకాల ఆర్ట్స్ వేయనున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ పనులను వచ్చే నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, టూరిజం డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్ రెడ్డి, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డీటీసీపీఓ అన్సారీ, ఆలయ ఈఈ రాజేష్, మున్సిపల్ ఏఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.