అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:00 AM
నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలు, అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.

కరీంనగర్ టౌన్, జూన్ 26: నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలు, అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని భూములను గుర్తించి, వాటి సర్వే నంబర్ల వివరాలను తెలపాలని సూచించారు. ఆయా భూముల్లో ఏమైనా అక్రమ కట్టడాలు ఉంటే వాటిని కూల్చివేయడం, అక్రమంగా ఇంటి నంబర్లను కేటాయిస్తే వాటిని రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. నగరపాలక సంస్థ అనుమతి లేకుండా, అనుమతి కంటే ఎక్కువగా చేసిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ టౌన్ప్లానింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే వాటిని డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో మహేశ్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, టౌన్ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.