మెరిసిన తెల్ల బంగారం
ABN , Publish Date - May 24 , 2024 | 12:23 AM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం మెరిసింది. క్వింటాల్కు గరిష్ఠంగా 7,550 రూపాయలు పలికింది.
జమ్మికుంట, మే 23: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం మెరిసింది. క్వింటాల్కు గరిష్ఠంగా 7,550 రూపాయలు పలికింది. వారం క్రితం క్రమంగా తగ్గిన పత్తి ధర క్వింటాల్కు 7,050 రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వ మద్ధతు ధర 7,020 ఉండగా, ఆ సమయంలో ప్రైవేట్ ట్రేడర్స్ 30 రూపాయలు మాత్రమే ఎక్కువ చెల్లించి పత్తి కొన్నారు. ఫిబ్రవరిలో మద్ధతు ధర కన్నా ఎక్కువ ధర పలుకడంతో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లను నిలిపి వేసింది. అప్పటి నుంచి ప్రైవేట్ ట్రేడర్స్ వేలం ద్వారా పత్తి కొంటున్నారు.కొద్ది రోజులుగా మార్కెట్కు సుమారు మూడు వందల క్వింటాళ్ల లోపు పత్తిని రైతులు విక్రయానికి తీసుకు వస్తున్నారు. పత్తి ధర తగ్గిన సమయంలో 50 నుంచి 70 క్వింటాళ్ల లోపు మాత్రమే పత్తిని విక్రయానికి తెచ్చారు. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండడంతో వానాకాలం పెట్టుబడుల కోసం రైతులు తమ ఇళ్లలో నిల్వ చేసుకున్న పత్తిని విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గురువారం పది మంది రైతులు 120క్వింటాళ్లు విడి పత్తి విక్రయానికి తీసుకు వచ్చారు. ప్రైవేట్ ట్రేడర్స్ బహిరంగ వేలం ద్వారా గరిష్ఠ ధర 7,550, కనిష్ఠ ధర 6,700 రూపాయలు చెల్లించి కొన్నారు.