సమస్యల వలయంలో రాజీవ్గృహకల్ప
ABN , Publish Date - May 27 , 2024 | 12:12 AM
కొత్తపల్లి మండలం చింతకుంటలోని రాజీవ్ గృహకల్ప సముదాయం సమస్యలతో సతమతమవుతోంది. ఈ సముదాయంలోని రెండు సైట్లలో కలుపుకుని 1,756 ప్లాట్లు ఉన్నాయి. రాజీవ్ గృహకల్ప సముదాయంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు.
![సమస్యల వలయంలో రాజీవ్గృహకల్ప](https://media.andhrajyothy.com/media/2024/20240511/5054_0276210021.jpg)
భగత్నగర్, మే 26: కొత్తపల్లి మండలం చింతకుంటలోని రాజీవ్ గృహకల్ప సముదాయం సమస్యలతో సతమతమవుతోంది. ఈ సముదాయంలోని రెండు సైట్లలో కలుపుకుని 1,756 ప్లాట్లు ఉన్నాయి. రాజీవ్ గృహకల్ప సముదాయంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలు చెత్తా చెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రాజీవ్గృహ కల్ప సముదాయం మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకు పోయి కంపుకొడుతున్నది. పంచాయతీ పాలక వర్గం ఉన్నా, ప్రత్యేక పాలనాధికారులు ఉన్నా పారిశుధ్యంపై పట్టింపు లేక నిరుపేదలు నానా అవస్థలుపడుతున్నారు. వర్షాలకు పడిపోయిన చెట్టును కూడా తొలగించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులున్నాయి. తాగునీరు సైతం నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నారని, అవికూడా సరిపడా రావడం లేదని వాపోతున్నారు.
ఫ అసాంఘీక కార్యకలాపాలకు నిలయం
రాజీవ్గృహ కల్ప గృహ సముదాయంలో కొన్ని ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఖాళీగా ఉన్న గృహాలు అసాంఘీక కార్యక్రమాలకు నిలయాలుగా మారిపోయాయి. కాలనీలో పరిస్థితి అధ్వానంగా తయారైందని, ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే నాయకులు సమస్యలు వచ్చినప్పుడు కనిపించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రాజీవ్గృహ కల్ప సముదాయంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.