ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:28 AM
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు సకాలంలో స్పందించాలని, సత్వరమే పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు.
![ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_a0544516da.jpg)
సిరిసిల్ల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు సకాలంలో స్పందించాలని, సత్వరమే పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దరఖాస్తు చేసుకుంటారని వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించాలని, పరిష్కరానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పెండింగ్లో ఉంచకూడదని అన్నారు. దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు కారణాలను అర్జీదారుడికి తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు అనంద్కుమార్, మదుసూధన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉప సర్పంచ్పై ఫిర్యాదు
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలు, చెక్కులపై ఉపసర్పంచ్ శ్రీకాంత్ సంతకాలు పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ, వార్డు సభ్యులు రమేష్, అంజవ్వ, అనిత, హరీష్, అరుణ, కో ఆప్షన్ సభ్యులు శ్రీకాంత్, హమీద్ కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫిర్యాదు చేశారు. గతేడాది మే నుంచి నవంబరు వరకు రూ.3.50 లక్షలు రావాల్సి ఉందని, దీంతోపాటు ఎంబీల ద్వారా రూ.7.50 లక్షలు రావాల్సి ఉన్నాయని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపసర్పంచ్పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.