ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Apr 12 , 2024 | 11:54 PM
కమిషనర్ కంప్లైంట్ సెల్ (సీసీసీ)కు వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యే దృష్టి సారించాలని సీపీ అభిషేక్ మొహంతి అన్నారు. కమిషనరేట్ కేంద్రంలో నేర సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 12: కమిషనర్ కంప్లైంట్ సెల్ (సీసీసీ)కు వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యే దృష్టి సారించాలని సీపీ అభిషేక్ మొహంతి అన్నారు. కమిషనరేట్ కేంద్రంలో నేర సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీసీసీ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటిపై తగినవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. చెక్పోస్ట్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాహన తనిఖీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే బైండోవర్ చేసిన వారి గడువు ముగిసిన వారిని మళ్లీ బైండోవర్ చేయాలని సీపీ ఆదేశించారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తే జరిగే పరిణామాలపై ఫ్లాగ్మార్చ్ చేస్తున్న సమయంలో అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలన్నింటిని సంబంధిత స్టేషన్ల అధికారులు పరిశీలించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను, జాప్యానికి కారణాలను సీపీ అడిగి తెలుసుకున్నారు. తర్వగా కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. భౌతిక నేరాలకు సంబంధించిన వారెంట్లను అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నియమావళి అమలుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎటువంటి ఉల్లంఘనలు ఉన్నా సంబంధిత సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మినారాయణ, ఏసీపీలు శ్రీనివాస్, నరేందర్, వెంకటరమణ, శ్రీనివాస్జి, మాధవి, విజయ్కుమార్, వేణుగోపాల్, కాశయ్య పాల్గొన్నారు.