పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:34 AM
పంచాయతీరాజ్ వ్వవస్థను పటిష్టం చేసి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానకొండూర్లో ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీపీ, జడ్పీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది.

మానకొండూర్, జూలై 7: పంచాయతీరాజ్ వ్వవస్థను పటిష్టం చేసి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానకొండూర్లో ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీపీ, జడ్పీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేసీఆర్ హయంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు. తెలుగు రాష్ర్టాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు సమావేశంతో రాష్ర్టానికి ఒరిగిందేమి లేదన్నారు. ప్రాంతీయ పార్టీలకు బతుకు లేదన్న మోదీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతోనే బ్రతుకుతున్నాడని అన్నారు. పులిలా ఉన్న మోదీ ఇప్పుడు పిల్లిలా మారి పవన్కల్యాణ్, చిరంజీవి చేతులు ఎత్తాడని విమర్శించారు. పార్టీ కోసం నాయకులు పని చేయాలని, ప్రతిపక్ష పార్టీల మీదనే ఎక్కువ ఆశలు ఉంటాయని అన్నారు. డ్యాంలు ఎండిపోయి నీళ్లులేక రైతులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ వీడిన భయపడేది లేదని, కొత్త రక్తంతో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ బీఆర్ఎస్ను విమర్శించడం తగదన్నారు. అనంతరం జడ్పీటీసీలు, ఎంపీపీలను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీష్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్రావు, మేయర్ సునీల్రావు, మాజీ మేయర్ రవీందర్సింగ్ పాల్గొన్నారు.