ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Jan 06 , 2024 | 11:59 PM
జిల్లాలో ఆపరేషన్ స్మైల్ - 10 కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల చివరి వరకు కార్యక్రమాల అమలుపై అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో సమావేశం నిర్వహించారు.
![ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా చేపట్టాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/2_cad9d9ce0d.jpg)
సిరిసిల్ల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆపరేషన్ స్మైల్ - 10 కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల చివరి వరకు కార్యక్రమాల అమలుపై అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, కార్మిక, విద్యా, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భిక్షాటన చేస్తున్న పిల్లలు, వీధి బాలలను గుర్తించాలన్నారు. తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్నవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల సంస్థపై చర్చిస్తూ దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలన్నారు. దివ్యాంగులను ఎవరైనా కించపరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్జెండర్లకు పునరావాసం, ఐడీ కార్డులను అందించే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రుల్లో బ్యాంకుల్లో వయోవృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. సఖి కేంద్రానికి వచ్చే మహిళలకు న్యాయమైన సేవలు అందించాలన్నారు. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహారాన్ని తనిఖీ చేయాలని సీడీపీవోలను ఆదేశించారు. మహిళలపై లైంగింక వేధింపులను అరికట్టడానికి పనిచేసే ప్రదేశాల్లో నివారణ కోసం ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీల ద్వారా వివరాలు సేకరించాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, చైల్ట్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంజయ్య, జిల్లా విద్యాధికారి రమేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్మోహన్రావు, బీసీ వేల్ఫేర్ అధికారి మోహన్రెడ్డి, ఎస్డీసీ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.