ఓటమి భయంలో మోదీ
ABN , Publish Date - Apr 23 , 2024 | 01:22 AM
తొలిదశ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన స్పందన చూసి ఓటమి భయంతో మోదీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
- అందుకే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
- మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ అర్బన్/సుభాష్నగర్, ఏప్రిల్ 22: తొలిదశ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన స్పందన చూసి ఓటమి భయంతో మోదీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో మోదీ ఉన్నారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు ఇస్తారని మాట్లాడుతున్నాడని, సంపదంతా ముస్లింలకే ఇస్తే 85 శాతం హిందువులకు ఆయన ఏం లాభం చేశాడో చెప్పాలన్నారు. పాంచ్ న్యాయ్ ద్వారా దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాన న్యాయం జరగాలని రాహూల్ గాంఽధీ నిర్ణయం తీసుకుంటే దీనిని జీర్ణించుకోవడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఏం చేసిందో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అవినీతి ఆరోపణలతోనే తీసేసారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో ఒక పనైనా ప్రలజకు ఉపయోగపడేది చేశాడా అని ప్రశ్నించారు. బీజేపీకి సీనియర్ నాయకులు లేరని, కాంగ్రెస్ పార్టీ వెంట ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్యేలు అందరం ఐక్యంగా ఉన్నామన్నారు. డబ్బులతో ఓట్లు కొనుక్కోవాలనుకున్న వ్యక్తికి సంబందించిన ఆరు కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారని, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, పరోక్షంగా మాజీ ఎంపీ వినోద్కుమార్ను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేసిన వినోద్కుమార్ ఈ నియోజకవర్గానికి ఏమి చేయలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నాయకుడిని కూడా గుర్తు పట్టడని, కనీసం చేయి కూడా కలపడని, నియంతలాగా వ్యవహరించాడని అన్నారు. ఇలాంటి వారంతా ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగదా ఉండాలన్నారు. అధిష్ఠానం సూచనల మేరకే వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారన్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నావాళ్ళకు ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం నుంచి పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపట్టి అన్ని మండలాలు, గ్రామాలు తిరుగుతామన్నారు. పార్లమెంట్ పరిధిలో నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచామని, ఉమ్మడి జిల్లాలో 13 మందికి గాను ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రాజేందర్రావు పాల్గొన్నారు.