వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:16 AM
వేసవి సమీపిస్తున్న దృష్ట్యా నీటిఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. గురువారం చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. 12 అంశాలతో కూడిన ఎజెండాపై కౌన్సిలర్లు చర్చించారు.
- నీటి సరఫరా మోటార్ల రిపేరుకు నిధులు
- అన్నపూర్ణ భోజన నిర్వహణకు రూ 16.58 లక్షలు
- సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం
సిరిసిల్ల, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): వేసవి సమీపిస్తున్న దృష్ట్యా నీటిఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. గురువారం చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధ్యక్షతన సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. 12 అంశాలతో కూడిన ఎజెండాపై కౌన్సిలర్లు చర్చించారు. సిరిసిల్లలో నీటి సరఫరా నిర్వహణ కోసం రగుడు ఫిల్టర్ బెడ్లో నీటిని పంపింగ్ చేసే మోటార్ల మరమ్మతులకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు. సిరిసిల్లలో ఐదు రూపాయలకే భోజనాన్ని అందించే అన్నపూర్ణభోజన వసతిని మరో సంవత్సరం పాటు కొనసాగించే విధంగా రూ 16.58 లక్షలు మంజూరు చేశారు. సిరిసిల్లలోని గాంధీ, అంబేద్కర్, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, పోలీస్స్టేషన్ జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు పాడైపోవడంతో వాటి స్థానంలో కొత్త లైట్లను ఏర్పాటు, మరమ్మతులకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు. రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, మజీద్ల వద్ద మౌలిక వసతులు కల్పించడానికి రెండు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై చర్చలు జరిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
- మున్సిపల్ కమిషనర్ లావణ్య
మున్సిపల్ నుంచి అందించే సేవల్లో ఏమైనా నిర్లక్ష్యం జరిగితే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ లావణ్య అన్నారు. నూతనంగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన లావణ్యను గురువారం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణితో పాటు కౌన్సిలర్లు సన్మానించి స్వాగతించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సిరిసిల్ల ప్రజలకు పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పార్కుల నిర్వహణ వంటి సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తానన్నారు. మున్సిపల్కు చెల్లించాల్సిన ఇంటిపన్నులు వాణిజ్యపరమైన పన్నులు వంద శాతం చెల్లిస్తూ సిరిసిల్లను ఆదర్శవంతంగా నిలిపారని అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా నిలపాలన్నారు. ఇప్పటి వరకు 80 శాతం పన్నుల వసూలు జరిగిందని 15 రోజుల్లోనే పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వామలు కావాలని కోరారు. పాలకవర్గ సభ్యులు కూడా సహాయసహాకారాలు అందించాలన్నారు. తడిచెత్త, పొడిచెత్త, హానికరమైన చెత్తలను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని బహిరంగ ప్రదేశాల్లో వేయవద్దని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి కమిషనర్కు పట్టణాభివృద్ధిలో పాలకవర్గం పూర్తిగా సహాయ సహాకారాలు అందిస్తుందని అన్నారు.
కరోనా కష్టకాలంలోనూ సేవలు అందించారు
- మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి
మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు కరోనా వంటి కష్టకాలంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా సేవలు అందించారని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులరాలు నగునూరి లక్ష్మి పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందడం కొంత బాధించ దగ్గ విషయమే అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాటికైనా పదవీ విరమణ తప్పదని అన్నారు. లక్ష్మి ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.