భ్రూణ హత్యలను అరికట్టేందుకు చర్యలు
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:06 AM
భ్రూణ హత్యలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు.
జ్యోతినగర్, మార్చి 28: భ్రూణ హత్యలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో భేటి పడావో కార్యక్రమంలో భాగంగా గురువారం ఎన్టీపీసీ టీటీఎస్ మిలీని యం హాల్లో లింగనిర్ధారణ పీసీపీఎన్డీటీ యాక్టుపై వర్క్షాప్ జరిగింది. అంగన్ వాడీటీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లకు పీసీపీఎన్డీటీ యాక్టుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడారు. భ్రూణ హత్యల కారణంగా స్త్రీల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతుందన్నారు. భ్రూణ హత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీపీఎన్డీటీ యాక్టు అమ లులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ యాక్టు ప్రకారం లింగర్ధారణ చేసి గర్భస్రావం చేయించిన ఇరు వర్గాలను శిక్షించే వీలు కల్పించినట్టు పేర్కొన్నారు. మొదటి సారి తప్పునకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమాన, రెండవసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలుశిక్ష, రూ.50వేల జరిమానా విధించేలా చట్టం రూపొందించబడినట్టు తెలిపారు. అనంతరం మహిళా సాధికారత కోఆర్డినేటర్ దయాఅరుణ మాట్లాడారు. ఫిర్యాదుల కోసం 104, 1098 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి రావుఫ్ఖాన్ ఎన్నికల ప్రాముఖ్యత, ఓటు హక్కు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో కృపాబాయి, డీసీపీఓ ఫర్వీన్, సీడీపీవోలు కవిత, స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.